పుట:తెలుగు వాక్యం.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

తెలుగు వాక్యం

1.246 : తెలుగులో ఆత్మార్థక వాక్యాలు ధాతువులకు, కొను అనే ధాతువు చేర్చటం వలన ఏర్పడుతుంది. ఈ కొను కు మిగతా క్రియల్లాగే కాల బోధక. ప్రత్యయాలు, కర్తృబోధక. క్రియా విభక్తులు చేరతై. కొను ను స్థూల దృష్టితో ఆత్మార్థబోధకమన్నా , మరికొన్ని అర్ధాలు కూడా దీని ద్వారా వ్యక్తమవుతై. కొను పరిగ్రహణంలో ధాతువులకేకత్వం లేదు. కొన్ని ధాతువులు కొను తో మాత్రమే ప్రయోగార్హాలు. ఊరుకొను, పుచ్చుకొనువంటి ధాతువు లట్లాంటివి. కొన్ని ధాతువులు కొను ను అంగీకరించవు. ఎరుగు, కూర్చుండు, తిను, పెరుగు,. పోవు, వచ్చు, వెళ్ళు వంటి ధాతువులు అట్లాంటివి. ధాతువుల ఆర్థపరిశీలన సమగ్రంగా జరిగినప్పుడు కొను పరిగ్రహణంలో ప్రవర్తించే విధివిశేషాలను గుర్తించటం సాధ్యం కావచ్చు. ధాతువుకు కొను చేరినపుడు వ్యాపారాన్ని కర్తృ ప్రయోజనపరంగా అన్వయించాలి. ఈ కింది వాక్యాలలో ఈ అర్థ భేదాన్ని గ్రహించవచ్చు.

(30)

a. వాళ్ళు పాలు అమ్ముతారు.
b. వాళ్ళు పాలు అమ్ముకొంటారు.
c. అతను పాఠం చదువుతున్నాడు.
d. అతను పాఠం చదువు కొంటున్నాడు.

పై వాక్యాలలో కొను ప్రయోగం ఉన్న క్రియలు వ్యాపార ప్రయోజనం కర్తకోసం అని తెలియజేస్తై. కొన్ని క్రియలకు కొను చేరినపుడు పారస్పర్యార్థం వస్తుంది. ఈ అర్థంలో కర్తృపదం బహువచన నామమై ఉండాలి. ఈ పారస్పర్యార్థం సహజంగా ధాతునిష్ఠమై ఉండి బహువచన నామం కర్తగా ఉన్నప్పుడు కొను ద్వారా వ్యక్తమవుతుంది. కొట్టుకొను, తిట్టుకొను, మాట్లాడుకొను, పోట్లాడుకొను, వంటి క్రియలు బహువచన నామ కర్తృత్వంతో పారస్పర్యార్థ బోధకాలవుతాయి. ఈ క్రింది వాక్యాలలో ఈ అర్థభేదాన్ని గమనించవచ్చు.

(31)

అతను (తన్ను తాను) తిట్టుకొన్నాడు.
వాళ్ళు బజారులో తిట్టుకొన్నారు.
అతను తనలో తాను మాట్లాడుకొంటున్నారు.
వాళ్ళు ఆ గదిలో మాట్లాడుకొంటున్నారు.

అకర్మకంగా ఉన్న కొన్ని ధాతువులు కొను చేర్చటం వల్ల సకర్మకమవు