పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగుమాండలికాలు : ప్రమాణభాష 409

నేర్పు) ఉన్నవాళ్ళు సంస్కారవంతులనిపి౦చుకొంటారు. వాళ్లవాడుక మిగిలిన వాళ్ళకు ప్రమాణం అవుతుంది. స్థూలంగా భాషలో ప్రామాణ్యం ఏర్పడేతీరు ఇది.

14.10. ఉచ్చరణలో లాగానే కొన్ని పదాల రూపనిష్పత్తిలో గూడా నాగరకుల భాషకు జానపదుల భాషకు భేదాలున్నాయి. పోతుంది, తెలియదు (తెలీదు, తెలీదు) - శిష్టుల వాడుకలో ఉంటే పోతది, తెలువదు మొదలైనవి ఇతరుల వాడుకలో ఉన్నాయి. నిజంగా పోతది, తెలవదు రూపాలకు తక్కువ విలువకట్టడానికి, పోతుంది, తెలియదు రూపాలకి ఎక్కువ విలువ కట్టడానికి భాషాగతమైన కారణాలులేవు. కురుస్తుంది : కురవదు, రెండూ శిష్టవ్యవహారంలో ఉన్నాయి, వాటిలాగానే తెలుస్తుంది : తెలవదు కూడా తెలుగు వ్యాకరణసూత్రాల వల్ల సాధ్యాలవుతాయి. కురవదు : తెలవదు రెంటికి ప్రాచీన కావ్యభాషలో కురియదు, తెలియదు అనే ప్రమాణరూపాలున్నాయి. చారిత్రకంగా జరగిందేమంటే పిలుచు : పిలవదు గణంలో కురియు : కురవదు శిష్టులభాషలో చేరాయి. కానీ తెలియు : తెలియదు చేరలేదు. జాలపదుల భాషలో ఇవి గూడా ఆగణంలోనే చేరాయి. కలియు : కలవదు, నెరయు : నెరవదు, ఇలాంటివన్నీ, అన్నితరగతుల వ్యవహారంలోనూ 'పిలుచు' వర్గంలో చేరిపోయినాయి. అయినప్పుడు 'తెలవదు' ఎందుకు ప్రమాణం కాలేదు ? ఇతరకారణాలవల్ల 'శిష్టత' సంపాదించిన వాళ్ల భాషలో ఈ మార్పు రాలేదు కాబట్టే 'తెలవదు' శిష్టేతర వ్యవహారానికి ఉపలక్షక మయింది. అంటే దీన్నిబట్టి ఏది శిష్ణం, ఏదిఅశిష్టం అనే నిర్ణయం కేవలం భాషకు సంబంధించింది కాదు. ఇతర సామాజిక విషయాలనుబట్టి గూడా ఏర్పడు తుంది. కోస్తా జీల్లాల వాడుకలో 'అలా, ఇలా, ఏలా' (గోదావరి) అనే రూపాలు 'అట్లా, ఇట్లా, ఎట్లా. (గుంటూరు) అనే వాటికంటే నాజూకు అవుతున్నాయి. 'వస్తున్నది' (గుంటూరు) కంటె 'వస్తోంది' (గోదావరి) కి ఇప్పుడు విస్తృతి పెరిగింది. చేసుకొనేందుకు (గుంటూరు) అని ఇదివరకు రాసేవాళ్ళు 'చేసికొందికి' అని రాస్తున్నారు. 'ఏ౦ది' కంటె 'ఏమిటి' నాజూక్తైన మాట. ఒకేకాలంలో శిష్టవ్యవహారంలో ఉన్న రూపాలమధ్య పోటీ ఏర్పడి కొన్ని వాడుకలో నిలుస్తాయి. కొన్ని జారిపోతాయి. ఆ నిల్చినవి ప్రామాణికాలు.

14.11. తెలుగు నాడంతటా వ్యాప్తిలోఉన్న పైభేదాలేగాక ప్రాంతీయంగా కూడా శిష్టశిష్టేతర వ్యవహార భేదాలు కనిపిస్తాయి. కళింగ మండలంలో