పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

ఫిరోజ్‌షా మెహతా, కాశీనాధ్‌ తెలంగ్ లతో కలసి 1871లో ప్రారంభించిన ఆందోళన ద్వారా ఆయన ప్రజాసేవారంగంలో అడుగుపెట్టారు. ఆ క్రమంలో 1873లో బద్రుద్దీన్‌ తయ్యాబ్జీ బొంబాయి కార్పోరేటర్‌గా, 1882లో బొంబాయి లెజిస్లేటి వ్‌ కౌన్సిల్‌ సబ్యునిగా ఎంపికయ్యారు. ప్రజా ప్రతినిధిగా భాధ్యాతలను నిర్యహిస్తూనే భారతీయుల భవిష్యత్తుకు విఘాతం కల్గించగల బ్రిటిష్‌ ప్రభుత్వ చర్యలను, చట్టాలను ప్రతిఘటిస్తూ త్రీస్టార్స్‌తో కలసి విజయవంతంగా పలు పోరాలు చేస్తూ ప్రజాభిమానం మూటగట్టుకున్నారు.

1885 డిసెంబర్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పడిన తరు వాత బద్రుద్దీన్‌ తయ్యాబ్జీ ఆ సంస్థతో పూర్తిగా మమేకమయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌ విధివిధాన నిర్ణయాలలో, నిర్మాణం రూపకల్పనలో బద్రుద్దీన్‌ ప్రధాన పాత్ర నిర్వహించారు. 1887లో మద్రాసులో జరిగిన కాంగ్రెస్‌ జాతీయ సమావేశాలకు బద్రుద్దీన్‌ అధ్యాక్షత వహించారు. ముస్లింలను కాంగ్రెస్‌కు దూరంగా ఉంచాలని ప్రయత్నించిన సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌, సయ్యద్‌ అమీర్‌ ఆలీ, నవాబు అబ్దుల్‌ లతీఫ్ ల వాదనలను ఆయన సమర్ధవంతంగా తిప్పికొట్టారు . 1895లో ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే వరకు భారత జాతీయ కాంగ్రెస్‌ పెరుగుదల, పటిష్టతకు తయ్యాబ్జీ ఎంతగానో శ్రమించారు.

ప్రజా జీవనరంగాలన్నిటిని రాజకీయాలు మాత్రమే ప్రభావితం చేయలేవని భావించిన తయ్యాబ్జీ సాంఫిుక, విద్య, ఆర్థిక రంగాలలో పురోభివృద్దిని కోరుకున్నారు. ఆ దిశగా కృషిసాగిస్తూ ముస్లిం సమాజంలో సంస్కరణలను ఆశించారు. ఆడపిల్లలకు ఆధునిక విద్యఅవసరమన్నారు. ఆయన ఆశించిన సంస్కరణలన్నిటినీ తన కుటుంబం ద్వారా ఆచరించి చూపారు. ముస్లిం సమాజాన్ని అన్ని రంగాలలో ప్రగతిపదలో చూడాలన్న ఆకాంక్షతో సేవా-విద్య-ఆర్థిక సంస్థలను స్థాపించి పలు సేవలందించారు.

న్యాయశాస్త్ర ప్రవీణుడుగా ఖ్యాతిగడించిన తయ్యాబ్జీ 1902లో బొంబాయి హైకోర్టు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1906లో అనారోగ్యం వలన ఇంగ్లాడ్‌ వెళ్ళారు. ఆ సమయంలో ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియామకాన్ని క్రమబద్దం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్ లు జారీ చేసింది.

ఈ విధంగా అటు జాతీయవాదిగా, ఇటు ప్రధాన న్యాయమూర్తిగా, మరోవైపు ప్రజా సేవకుడిగా అపూర్వ సేవలందించి 'ఆయన మొదట భారతీయుడు, ఆ తరువాత ముస్లిం, తుదకు విశ్వమానవుడు' అని చరిత్రచే ఘనంగా కీర్తించబడిన జస్టిస్‌ బద్రుద్దీన్‌ తయ్యాబ్జీ 1906 ఆగస్టు 19న ఇంగ్లాండులో కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌