అధ్యాయం - 2
రాజ్యస్థాపన దిశగా
(The Dawn of the kingdom)
892 A.H. (1487 A.D.)లో అనుకోని ఒక హఠాత్పరిణామ సంఘటన సుల్తాన్ కులీ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయికి అవకాశం కల్పించింది. బీదర్ లోని కొన్ని అసాంఘిక శక్తులు మహమూద్ షా నివసించే కోటపై దాడి చేయడం జరిగింది. దీనికి వర్గ వైషమ్యాలే కారణమని చెపుతారు. బీదర్కు వలస వచ్చిన విదేశీ ప్రముఖులైన కొందరు హసన్ అలీ సబ్జె వారి, సయ్యద్ మీర్జాయ్, మస్సాది, సుల్తాన్ కులీ వీరంతా ఓ పదిమంది సైనికులతో దళంగా మారి బీదర్ చక్రవర్తి ప్రాణాలు కాపాడడమే కాకుండా తమ సైనిక బలగం శత్రువులు దాడిని ఎదుర్కోవడానికి వచ్చే వరకు వారిని నిలువరించి, వారి కుట్రను నీరు గార్చి విజయం సాధించారు. రాజు పట్ల తన నియతి, నిబద్దతను, నిజాయితీని నిరూపించుకోవడానికి సుల్తాన్ కులీ ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవడం వలన సంక్లిష్ట సమయంలో తన ప్రాణాలు కాపాడినందుకు గాను రాజు అభిమానాన్ని చూరగొన్నాడు. ఈ సంఘటన జరిగిన సరిగ్గా మూడు సంవత్సరాల తరువాత పశ్చిమ తీర ప్రాంతంలో తిరుగుబాటు దారుల దాడులు మొదలయ్యాయి.
పశ్చిమ ప్రాంతం, గోవా దాని పరిసర ప్రాంతాల సంరక్షణ బహమనీ అధికారి అయిన బహదూర్ గిలాని చేతిలో వుండేది. గిలాని తన నమ్మకస్తులైన కొందరితో కుమ్మక్కై 899 A.H. (1493 A.D.)లో బహమనీ రాజు పైన తిరుగుబాటును ప్రకటించాడు. అంతేకాకుండా పొరుగు రాజ్యమైన గుజరాత్కు చెందిన వర్తకపు ఓడలను దోచుకుని ఆ రాజ్యంపై కూడా తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. గుజరాత్ రాజు సుల్తాన్ మహమూద్ దీనిపై ప్రతీకారానికి బీదర్ బహమనీ రాజుపై ఒత్తిడి పెంచాడు. ఫలితంగా బహమనీ రాజు, ఖాసీం బారీద్ ను వెంటబెట్టుకుని స్వయంగా బయలుదేరగా మాలిక్ అమ్మద్ బారి, యూసుఫ్ ఆదిల్