Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాయం-17

గోల్కొండ పతనం

(The Fall of Golcunda)

షా ఆలమ్, అబుల్ హసన్ మధ్య కుదిరిన ఒప్పందం మొఘలులకు వరంగా మారితే గోల్కొండకు దురదృష్టకరమైనదిగా చెప్పవచ్చు. నైతికత లేనిదిగా కుతుబ్ షాహి ప్రభుత్వానికి తప్పుదోవ పట్టించేదిగా వుంటూ గోల్కొండకున్న న్యాయపరమైన హక్కులను, యుద్ధనీతులను దాటవేస్తూ కొల్లగొట్టింది. ఈ ఒప్పందం మొఘల్ చక్రవర్తికి ఎనలేని లాభాలు అందించడంలో సాక్ష్యంగా నిలిచింది. అలాగే గోల్కొండను చెప్పలేని కష్టాలపాలు జేసింది. మొఘల్ ప్రభుత్వం తాను కోరుకున్నది సాధించుకున్నది. వార్షిక కప్పం కింద బకాయిలు, యుద్ధ నష్టపరిహారం కింద అధికమొత్తంలో ధనరాశి, ఆర్థిక వనరు లందించే మల్కేడ్, సేరమ్ జిల్లాలు. ఈ జిల్లాలను పొందడమే ప్రతిష్టాత్మకంగా, పరమావధిగా మొఘల్ సామ్రాజ్యం భావించింది. సామ్రాజ్యాధిపత్యానికి అడ్డంకిగా భావించిన హిందూ మంత్రులను మట్టుబెట్టడం జరిగింది. ఇప్పుడు చక్రవర్తికి భవిష్యత్ ప్రణాళికలను సిద్దం చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ దొరికింది. అందుకే మొఘల్ సేనను గోల్కొండ నుండి వెనక్కి రమ్మని ఆదేశాలు పంపడమే గాక, బీజాపూర్ను జయించడానికి వ్యూహం పన్నసాగాడు. ఈ ఒప్పందం ప్రకారం రాజకీయ లబ్ది, వస్తు, నగదు రూపేణా అనేక ప్రయోజనాలు పొందినా, చక్రవర్తి గోల్కొండ రాజ్యంపై షరతులను గౌరవించ కుండా ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు. బీజాపూర్ యుద్ధం నుండి ముక్తి పొందిన మరుక్షణమే ఒప్పంద పత్రాలన్నీ ముక్కలుగా చింపేశాడు. ఫలితంగా గోల్కొండ తాము మొఘలులను విశ్వసించినంతగా చక్రవర్తి కూడా తమపై నిబద్దతతో, నిజాయితీతో వ్యవహరిస్తాడనుకున్న గోల్కొండ ఆశలు నీరుగారిపోయాయి. ఇలా జరుగుతుందన్న వాటిపై గోల్కొండకు ఎంత మాత్రం ఊహకందలేదు. ఫలితంగా వారి కుట్ర పూరిత పథకాలకు అనేక కష్టనష్టాలకు గురి కావలసి వచ్చింది. అంత:పుర స్త్రీలు, అక్కన్న మాదన్నల ఖండిత శిరస్సులను చక్రవర్తికి పంపడంలో