Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సహింపరాని విషయమైంది. రంధులఖాన్, షాజి దక్షిణ భూభాగంలో తమ ఆధిక్యతను నిరూపించుకుంటూ ముందుకు పోసాగారు. అదే సమయంలో కుతుబ్ షాహిలు వెనుకబడి పోవడానికి మొఘలులతో రాజకీయ, పాలనా వ్యవహారాలతో ఒక సత్సంబంధ పూరితమైన వాతావరణం నెలకొనకపోవడమే. 1636 A.D. లో జరిగిన ఒడంబడిక ప్రకారం ఇరు రాజ్యాల మధ్య మైత్రి పూర్వక అవగాహన ఏర్పడడం, మొఘలులు, కుతుబ్ షాహీల స్నేహపూరిత వ్యవహారాలపై సమ్మతిని తెలపడంతో కుతుబ్ షాహి ప్రభుత్వం ఉపశమనం పొంది ప్రశాంతమైన శ్వాసను తీసుకోగలిగారు. ఆ తరువాత తమ శక్తిని, సమయాన్ని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో తీసుకోవలసిన రాజకీయ వ్యూహాల్ని, ప్రణాళికలకు వెచ్చించగలిగారు. ప్రణాళికలకనుగుణంగా కుతుబ్షాహీ సేన రెండు దళాలుగా విభజింపబడి ఒకటి ఉత్తర భాగానికి, రెండవది దక్షిణ భాగానికి కేటాయించడమైనది. వాయవ్య ప్రాంతంలో మొఘలులు ముందుగానే చొచ్చుకుని వచ్చి ఆక్రమించేయడం వలన అటు వైపు వెళ్ళే ప్రసక్తి రాలేదు. కాని ఈశాన్యం వైపుకు సేనను నడిపించి 1656 A.D. (1063 A.H.)లో విశాఖపట్నం (Vizagapatam) ను స్వాధీనపరుచుకున్నారు. కొత్త ప్రాంతాల విలీనంతో కుతుబ్ షాహి సరిహద్దులు ఆంధ్రలోని ఉత్తర ప్రాంతపు చివరి అంచులదాకా వ్యాపించి, సామళ్ల కోట (Samalkota) ను మిలట్రీ హెడ్ క్వార్టర్గా స్థాపించారు. అర్థిస్తాన్ (Ardistan) నుండి వచ్చిన చిన్న వ్యాపారవేత్త మహమ్మద్ సయీద్ (Mohd. Saeed) 'మీర్ జుమ్లా' స్థాయికి ఎదిగి దక్షిణ ప్రాంతాల్లో విజయం సాధించడానికి తగిన కృషి చేశాడు. ఇతనికి దక్షిణ ప్రాంతాలవిలీనానికి కృషి చేయాలన్న నిర్దిష్టమైన ఆదేశాలిచ్చి కర్నాటక గవర్నర్గా నియమింపబడ్డాడు. మహమ్మద్ సయీద్ గవర్నర్ గా వున్న కాలంలో కర్నాటక ప్రావిన్స్, కడపకు ఈశాన్యంలో వున్న కంభంకు పరిమితమై వుండేది. సయీద్ మొదటి భేటి శక్తివంతుడైన చిన్నపటం (Chinna patam) రాజుతో కావడంతో అది కాస్త విషాదంగా మారింది. ఈ భేటీ ఓటమిని చవిచూసింది. ఈ సంఘటనతో సయీద్ తన ముందున్న బృహత్కార్యాన్ని సింహావలోకనం చేసి తిరిగి అంచనా వేసుకోవలిసి వచ్చింది. వెంటనే తన బలగాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి మంచి ఫలితాలు సాధించాడు.