Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజభవనానికి తెచ్చి రాజుకు అప్పగిస్తారు. కాని ఈ సంఘటన జరిగిన కొద్దికాలానికే రాజు మరణిస్తాడు. తండ్రి మరణం తర్వాత పన్నెండేళ్ళ వయసులోనే అబ్దుల్లాకు రాజ్యాభిషేకం చేశారు. పట్టాభిషేకానికి ముందు ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. సాధారణంగా రాజ్య పరిపాలన ఒక చేతి నుండి మరో చేతికి మార్పిడి జరిగే సమయంలో, ప్రత్యేకించి సింహాసనాన్ని అధిష్టించే వ్యక్తి మైనర్ (బాలుడు) ఐతే అల్లర్లు జరగడం, అక్రమాలు, అలజడులు చెలరేగి సమాజంలో అశాంతి వ్యాపిస్తుంది. ఇలాంటి వాటిని అదుపులో వుంచి నియంత్రించడానికి అన్ని రకాలరక్షణ బాధ్యతలు చేపట్టింది. రాజధాని నగరంలో దుండగులు చెలరేగి దాడులు చేసి దోపిడీలు చేయడం, దోచుకోవడం లాంటి దౌర్జన్యానికి పాల్పడే అవకాశం వుంటుంది. నగర వాసులరక్షణకు ముప్పు వాటిల్లే ప్రమాదం వుంటుంది. ముఖ్యంగా విదేశాలనుండి వచ్చి స్థిరపడినవారు, ప్రత్యేకించి పర్షియన్లు, తుర్కిష్ వారు వ్యక్తిగతంగా వారి వృత్తులను చేసుకోవడం, వ్యాపారాలు కొనసాగించడం, లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో వున్నటువంటి వారు భయాందోళనలకు గురై వారి ప్రాణాలకు, ఆస్తులకు నష్టం వాటిల్లగలదన్న అభద్రతాభావంతో అల్లాడిపోతారు. ఫలితంగా మన్సూర్ ఖాన్ హబ్సీ (Mansur Khan Habshee), అతని స్నేహితులైన మాలిక్ అల్మాస్, మాలిక్ యూసుఫ్ కు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని, అల్లర్లను అదుపులో వుంచడానికి నియమించడం జరిగింది. పోలీస్ కమీషనర్ ఖాసిం బేగ్ ను గోల్కొండ చౌడీ దగ్గర, అతని డిప్యూటీని చార్మినార్ దగ్గర నియమించి నగరం లోపలగాని, నగర పరిసర ప్రాంతాలలో గాని ఎలాంటి చట్టవ్యతిరేక పనులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. పట్టాభిషేక కార్యక్రమం అతి వైభవంగా, ఆడంబరంగా మహమ్మదీ మహల్లో జరిగింది. ఎప్పటిలాగే సాంప్రదాయ ప్రకారం చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ దుస్తులు పంచడం, పండితులకు, మౌల్వీలకు, ఆధ్యాత్మిక రంగాలలోని ప్రముఖులకు, విద్యార్థులకు, సయ్యద్ పరివారాలకు, పేదలకు ఉదారంగా దాన ధర్మాలు చేయడం, నెలసరి వేతనాలు అందజేయడం జరిగింది. ఏనుగుల మీద, అలంకరించబడిన బండ్ల మీద, పంచదార, తీపి పదార్థాలు ప్రధాన వీధులగుండా, చిన్న చిన్న దారులవెంట వెళ్తూ ప్రజలందరికీ పంచిపెడ్తూ పట్టాభిషేకం జరిగినట్లు ప్రకటించబడుతుంది. కొత్తరాజు పేరిట నాణేలు ముద్రించబడ్డాయి. రాజ దర్బారులోని ఆస్థాన కవులుగా పిలువబడే ప్రముఖ కవులు మౌలానా రౌనఖి (Moulana Rounaqi), ఫకీర్ సిరాజ్ (Faqueer Siraj) ఈ సందర్భంగా 1034 A.H. తారీఖుతో కొత్త రాజు పై ప్రశంసలతో కవితా గానం