Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రోదనశబ్దంబుచేత వనాంతరంబునందు గిరిగుహాముఖంబులతోడ వనంబులు
దుఃఖించినట్లుండె నిత్తెఱంగునం జని వివిక్తజనసంకులంబగు నొక్కనదీపులిన
తటంబునం జేర్చియున్నచితిసమీపంబున శిబిక నునిచి రప్పుడు తార శిబికాంతర
శాయి యగుపతి నాలోకించి తచ్ఛిరంబు నిజాంకంబునం జేర్చుకొని దుఃఖితయై
యి ట్లనియె.

630


శా.

హా కీశోత్తమ హా కృపాజలనిధీ హా గోత్రభిన్నందనా
హా కల్యాణగుణోత్తరా సుజనవర్యా హా మనోనాయకా
శోకవ్యాకులచిత్త నై మిగుల సంక్షోభించున న్నిప్పు డే
లా కారుణ్య మెలర్పఁ జూడవ యకార్యం బేమి గావించితిన్.

631


క.

వనచరవర చుట్లం బడి, ఘనతరశోకమునఁ జాల గాసిల్లెడునీ
జనమును గరుణ దలిర్పఁగఁ, గనుఁగొని భాషింప వింత కఠినత దగునే.

632


చ.

అనిమిషనాథనందన గతాసుఁడ వైనను నీముఖంబు నూ
తనజలజాభమై యుదితతామరసప్రియవర్ణతుల్య మై
యనుపమభూరిసమ్మదరసాప్లుత మై మని యున్ననాఁటిచా
డ్పున రమణీయకాంతిఁ గడుఁబొల్పుగ నొప్పుచు నున్న దిప్పుడున్.

633


సీ.

ప్లవగేంద్ర రామరూపంబునఁ గాలుండు నినుఁ బొలివుచ్చెనే నీతి మాలి
దిక్కఱి విధవలై దీనత నేడ్చుచు నీపత్ను లందఱు నిన్నుఁ గొలువ
నొక్కటఁ జనుదెంచి యున్నవా రేటికిఁ బలుకవు మఱి సర్వపౌరజానపదులు
భృత్యులు చమూపతులు మంత్రులు ప్రీతిఁ జనుదెంచియున్నారు సముచితముగ


తే.

వారినెల్ల సంభావించి వరుసతోడ, నీడుకొలుపుము పిమ్మట వేడు కలర
నీవు మేమును గలసి మహావనముల, సంతతంబును క్రీడఁ గావింత మధిప.

634


వ.

అని బహుప్రకారంబుల దుఃఖించుచుండి రంత నంగదుండు సుగ్రీవసహితంబు
గా రోదనంబు సేయుచుఁ బితృకళేబరంబు చితామధ్యంబునం బెట్టి విధిప్రకారం
బున ననలుఁ దరికొల్పిన నప్పావకుం డాత్మశిఖాపరంపరల వాలికళేబరంబు భస్మం
బుఁ జేసినంత సంచయనాదికృత్యంబులు నిర్వర్తించి పదంపడి నదీజలంబుల
వాలి కుదకక్రియలు గావించెఁ దక్కిన బంధుమిత్రజ్ఞాతులు వేర్వేఱ యుదకదా
నంబు గావించి రంతఁ బ్రేతకార్యంబు లన్నియు నిర్వర్తించి కృతకృత్యు లైరి
తదనంతరంబ సుగ్రీవుండు సలక్ష్మణుం డగురాము నుపాసించి యుండి సమస్త
వానరులు మంత్రిసహితంబుగా సుగ్రీవునిం బరివేష్టించి కొల్చియుండి రిత్తెఱం
గున నందఱుఁ గృతాంజలిపుటులై మహర్షులు పితామహునింబలె సక్లిష్టకర్ముం
డగురామచంద్రునిం గొల్చి యుండ నప్పుడు సుమేరుసమానశరీరుండును దరు
ణాదిత్యసన్నిభముఖమండలుండు నగుహనుమంతుండు ఫాలకీలితాంజలిపుటుం
డై రఘువల్లభున కి ట్లనియె.

635