Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బ్రియమునం దప్రియమునందు బెగడు వడక
క్షమ గలిగి సూర్యసుతవశగతుఁడ వగుమ.

571


ఆ.

వత్స యేన పోలె వాత్సల్యమున దివా, కరసుతుండు నిన్ను గారవించు
నతనిరిపుల రిపుల కయ్యెడువారల, విడిచి విహితవృత్తి వెలయు మింక.

572


క.

అనిశం బప్రణయ మతి, ప్రణయం బీరెం డొసంగు బహుదోషముల
న్విను మిటు గావునఁ బ్రియనం, దన మధ్యమభావ మొంది తనరుము నీవున్.

573


వ.

అని బోధించి శక్రపుత్త్రుండు శరసంపీడితుం డగుటం జేసి వివృత్తనేత్రుండును వికృ
తవదనుండును నై జీవితంబులు విడిచె నట్లు సంప్రాప్తమరణుం డైనవాలి నాలో
కించి ప్లవంగపుంగవు లెల్ల నాహాకారంబులు సేయుచు వెలవెలం బోయి బహు
పరాక్రమంబుల దుఃఖంచుచుండిరి కిష్కింధాపురంబు శూన్యచత్వరవేశ్మాంతం
బై యుండి నుద్యానంబులును బర్వతంబులును గాననంబులును దక్కినవాలి
విహారప్రదేశంబు లన్నియుఁ బాడఱినట్లు చూపట్టె నప్పుడు వానరు లందఱుం
గూడుకొని శోకావేశంబున.

574

మృతుం డైనవాలిం గూర్చి వానరు లందఱు విలపించుట

తే.

కడిమి నెవ్వాని భూరివేగమునఁ గాన
నములు వనములు మృదులతాంతములతోడ
ననిశ మనుబద్ధములుగఁ జేయంగఁ బడియె
నవ్విధం బింక నిపు డెవ్వఁ డాచరించు.

575


సీ.

సత్త్వసంపన్నుండు చతురుండు గోలభుం డనియెడు గంధర్వుఁ డాజికాంక్షఁ
బైనెత్తి వచ్చినఁ బరఁగ నెవ్వఁడు పదియేనువర్షము లసమానలీలఁ
బవలు రేయును ఘోరభంగిఁ గయ్య మొనర్చి యంత షోడశవత్సరాంతమందు
దుర్వారభుజవీర్యగర్వంబుపెంపున గోలభు నవలీలఁ గూల నేసి


తే.

కడఁగి మాకందఱకు వేడ్కఁ గలుగఁజేసె,నట్టి జితకాశి బలరాశి యమితబాహు
బలవినిర్జితదైతీయపాళి వాలి, యిత్తెఱంగున హతుఁ డయ్యె నృపునిచేత.

576


వ.

అని యద్భుతశోకంబులు మనంబునం బెనంగొన నందఱు దీనవదనులై సింహ
యుతం బైనమహాకాననంబున వృషభంబు పడినం దలంకుధేనువులచందం
బున సుఖంబు విడిచియుండి రంతఁ దార మృతుండైనపతి నవలోకించి శోకా
ర్ణవపరిప్లుత యై పరశుచ్ఛిన్నం బైనమహాద్రుమంబు నాశ్రయించిన వనలత
కైవడి నతనిం బరిరంభించి శోకబాష్పజలంబులు తదీయముఖంబున సాంద్రం
బుగాఁ గురియ నేడ్చుచు నిట్లని విలపించె.

577


ఉ.

హా హృదయేశ యెంత హిత మాడినఁ గైకొన కీవు వైరిసం
దోహవినాశకారి రణదుర్జయ రామశరాహతుండ వై
యూహ గలంగి కర్కశశిలోపచితం బగు దుష్ప్రవేశఘో