Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/718

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సనమును సత్త్వసంపదయు సర్వ మతండె యతండు నేఁడు నీ
ఘనతరఘోరవజ్రనిభకాండముల న్దెగి కూలెఁ బాపవ
ర్తనుఁ డగుపంక్తికంథరుని దక్షిణబాహు వడంగ నెంతయున్.

2087


శా.

ఈవాతాత్మజుఁ డివ్విభీషణుఁడు నీ కెంతేని సాహాయ్యము
న్గావింపం గడుమేటి వై రిపుని వీఁక న్మూఁ డహోరాత్రముల్
ప్రావీణ్యంబునఁ బోరి చంపితివి నీబాహాబలం బల్పమే
నీవీర్యంబున జానకిం బడసితి న్నిర్వైరినై మించితిన్.

2088


క.

అని యూఱడించి రాముఁడు, తనకరములు సాచి ప్రీతిఁ దమ్ముని నాలిం
గన మొనరించిన నపు డా, ఘనభుజుఁ డానంద మొందె గతవేదనుఁ డై.

2089


వ.

అంత నారఘుపుంగవుండు ముదితుం డై సభామధ్యంబున నున్నసుషేణునిం
బిలిచి మిత్రవత్సలుం డగునీసౌమిత్రియు మహాప్రాజ్ఞుం డగువిభీషణుండును
ద్రుమశైలయోధు లగుభల్లూకవానరగోలాంగూలవీరులును దక్కినసమస్త
సైనికులును రాక్షసప్రయుక్తశస్త్రాస్త్రపరంపరల నొచ్చి యున్నవారు వీరి నం
దఱ నధికప్రయత్నంబున విశల్యులం జేసి సుఖాత్ములం గావింపు మని పలికిన
మహాత్ముం డగునవ్వానరశ్రేష్ఠుండు రయంబునం జని విశల్యకరణిం గొని తెచ్చి
లక్ష్మణునకు విభీషణున కాంజనేయునకుఁ దక్కినయూథపులకు సమస్తసైన్యం
బులకుం జూపిన నాదివ్యౌషధిగంధం బాఘ్రాణించి లక్ష్మణుండు విగతవేదనుం
డును లలితశరీరుండు నై శోభిల్లెఁ దక్కినవా రందఱును వీతశరప్రవ్రణవేద
ను లై సుగ్రీవునిపనుపున సర్వాభరణభూషితు లై సర్వశోభాసమన్వితు లై
చారువిగ్రహులై మహనీయతేజోవిశేషంబునఁ జంద్రసూర్యులచందంబున బ్రకా
శించుచు సింహనాదంబులు సేయుచు నృత్తావాదిత్రగీతంబులు నెఱపుచు
గోలాంగూలంబులు ద్రిప్పుచు బహుప్రకారంబుల విహరించుచుండిరి విభీష
ణుండును సుగ్రీవుండును నంగదుండును హనుమంతుండును జాంబవంతుండును
నీలుండును నలుండును సుషేణుండును దక్కినయూథపులును విగతశ్రములై
సంతుష్టాంతరంగులై శుభలక్షణుం డగులక్ష్మణుం బురస్కరించుకొని యమృ
తంబు ప్రాపించినదేవతలకరణి రామునిం బ్రాపించి రావణున కవలంబనభూతుం
డైనశక్రజేతమరణంబునకు సమ్మోదంబు గాంచి విజయలక్ష్మీవిరాజమానుం
డైనలక్ష్మణుని విలోకించి హర్షవిశేషంబున సారెసారెకుం బూజించుచు సంపూ
ర్ణకాములై యథాసుఖంబుగా విహరించుచుండిరంత హతశేషు లైనరాక్షసులు
లంకకుం జని సముచితంబుగా రావణు సందర్శించి కేలు మొగిచి శోకభయ
గాద్గద్యంబున నిట్లనిరి.

2090


సీ.

దనుజేంద్ర నీప్రియతనయుండు శక్రారి కార్చిచ్చు వనవాటి నేర్చుకరణి
బాహాబలము మీఱఁ బటువిశిఖాగ్నులఁ దరుచరసేన నంతయు దహించి
మఖభుక్కు లరుదంద మహనీయదివ్యాస్త్రమహిమ దీపింప లక్ష్మణునితోడ