Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/713

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

ఆరక్షఃపతినందనుం డపుడు ఘోరాకారుఁ డై పేర్చి మౌ
ర్వీరావంబు చెలంగ సర్వజగము ల్భీతిల్లి కంపింప దే
వారాతు ల్వినుతింప వాయుశర మేయం దాని ఖండించె నే
పార న్లక్ష్మణుఁ డాకపు ల్వొగడ నైంద్రాస్త్రప్రయోగంబునన్.

2048


మ.

దనుజాధీశకుమారుఁ డప్పు డురగాస్త్రం బేసినం జూచి రా
మనరేంద్రావరజుండు వేల్పులు నుతింపం గారుడాస్త్రంబు నే
సిన నారెండును మింటఁ దార్కొని బలశ్రీ మీఱఁగాఁ బోరి గ్ర
ద్దన నన్యోన్యహతంబు లై ధరణిమీఁదం గూలె నత్యుద్ధతిన్.

2049


తే.

ఇటుల నవ్వీరశేఖరు లిరువు రుగ్ర, మూర్తులై వాహనంబున మొనసి యస్త్ర
సమర మొనరించునప్పు డేచాయఁ గన్నఁ, బ్రళయకాలంబునాఁటి తెఱంగు దోఁచె.

2050


క.

ద్యోవీథి నున్నమౌనులు, దేవత లారఘుకులప్రదీపకు నొగి సం
భావించుచు దీవించుచు, సేవించిరి సమరవిజయసిద్ధి దలఁచుచున్.

2051


ఉ.

అప్పుడు దైత్యవర్యుఁడు నృపాస్త్రనివారిత మైనబాణము
న్దప్పక చూచి యల్గి భుజదర్ప మిఁ కెన్నటి కంచుఁ గన్నులన్
నిప్పులు రాలఁ దీవ్రగతి నేర్పున వింట మహాసురాస్త్రముం
దప్పక కూర్చి యేసె వితతంబుగ మంటలు మింటఁ బర్వఁగన్.

2052


మ.

దనుజుం డిట్లు సమగ్రశక్తి నసురాస్త్రంబు న్బ్రయోగింపఁ జ
య్యన నయ్యస్త్రమహత్త్వ మెట్టిదొ యసంఖ్యాతంబు లై శూలముల్
ఘనచక్రాసిపరశ్వథంబులు గదల్ ప్రానంబులున్ శక్తికుం
తనికాయంబులు పుట్టి యాకసము నిండం బర్వె ఘోరంబుగన్.

2053


క.

ఆయుత్పాతము గనుఁగొని, పాయక దేవతలు మునులు భయమున నధిక
శ్రీయుతుఁ డగు సౌమిత్రి క, పాయము రాకుండఁ దోడుపడి ప్రోచి రనిన్.

2054


మ.

అసురాధీశకుమారబాహుగళితం బై ఘోర మై తీక్ష్ణ మై
యసిచక్రాదికగర్భ మై సకలభూతావార్య మై
బస మీఱ న్శ్వసనాతివేగమున శుంభల్లీల నేతెంచున
య్యసురాస్త్రంబును జూచి లక్ష్మణుఁడు తీవ్రాటోపసంరంభి యై.

2055


చ.

అలిగి మహేశ్వరాస్త్రము రయంబున నేసిన నమ్మహాస్త్ర ము
జ్జ్వలదినుఁ డాత్మతేజమున సాంద్రతమంబు నడంచుకైవడిం
దలకొని దానవాస్త్రమును దప్పక దగ్ధముఁ జేసి సత్రము
న్గలయ దహించినట్టిశిఖికైవడి శాంతి వహించె నంతయున్.

2056

ఇంద్రజిత్తు లక్ష్మణునిచేఁ జచ్చుట

వ.

ఇ ట్లమిత్రబలమర్దనుం డగులక్ష్మణుండు మాహేశ్వరాస్త్రంబున నసురాస్త్రంబు
నవలీల రూపుమాపి యంత నిలువక యంతకుభంగి నంతంత కధికరౌద్రుండై