Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/692

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జూచి తానును మిక్కిలి శోక మొంది
యిట్లు దీను లై యున్నవా రేల యనుడు.

1875


క.

ఆయసురేంద్రునివదనము, పాయక వీక్షించి శోకబాష్పపరిక్లి
న్నాయతలోచనుఁ డై ప్రే, క్షాయుతుఁ డాలక్ష్మణుండు గ్రక్కునఁ బలికెన్.

1876


తే.

ఏమి చెప్పుదు దనుజేంద్ర యింద్రజిత్తు
జానకిని జంపె నని పవమానసుతుఁడు
చెప్ప విని రాఘవేంద్రుండు చిత్త మెరియఁ
గన్నుగవ మోడ్చి మౌని యై యున్నవాఁడు.

1877


క.

అన విని విభీషణుం డో, యనఘా యిది యేటిమాట యనుచు సుమిత్రా
తనయుని వారించి మహా, వినయంబునఁ జేరి రామవిభునకు ననియెన్.

1878

విభీషణుఁ డింద్రజిత్తుచే వధింపఁబడినది మాయాసీత యని రామున కెఱిఁగించుట

ఉ.

మానవనాథ మారుతకుమారుఁడు నీరధి యింకె నన్నచం
దాన వచించె నప్పలుకు నమ్మఁగ రాదు దురాత్ముఁ డైనయా
దానవభర్తడెందమునఁ దప్పక యున్నతలం పెఱుంగుదు
న్జానకిఁ జంపఁ జూడఁ డిది సత్యము శోకము నొంద నేటికిన్.

1879


చ.

జనవర యేను నీకు మును జానకి నిమ్మని యెంత చెప్పిన
న్వినఁడు నిశాటనాథుఁ డవివేకత నట్టిదురాత్ముఁ డేల సీ
తను వధియింపఁ బంపు నిది సత్యము గాదు యథార్ధ మేని పె
ల్చన సచరాచరంబు లగుసర్వజగంబులు నేఁడు గ్రుంగవే.

1880


చ.

విమలవిచార రావణుఁడు వేయివిధంబుల సామదానభే
దముల మహీజ వేఁడియును దత్తను వంటఁగఁ జాలఁ డయ్యె నీ
రమణిని దాఁక నన్యునితరంబె జడోద్ధతిఁ దాఁకె నేని స
ర్పము నొగిఁ గేలఁ గైకొనిన బాలునికైవడి నేలఁ గూలఁడే.

1881


చ.

ఇది యొకబొంకు గాని మనుజేశ్వర నిక్కము గాదు శక్రజి
త్తదయత గెల్పు చేకొనుట కాసురహోమ మొనర్పఁ బూని దు
ర్మదమున మాయఁ బన్ని సుకరంబుగఁ గీశుల నెల్ల నీగతిం
గదనమునందు మోహితులఁగా నొనరించె విచార మేటికిన్.

1882

ఇంద్రజిత్తు నికుంభిలయందు హోమము సేయుటను విభీషణుఁడు రామునకు దెల్పుట

ఉ.

ఆదివిజారి యిప్పుడు మహాత్మ నికుంభిల కేగి యచ్చటన్
మోద మెలర్ప హోమము సముద్ధతి సల్పుచు నున్నవాఁడు త
ద్వేదికయం దవిఘ్నముగ వేలిమి పారము ముట్టెనేని శ
క్రాదిదిగీశు లంద ఱొక టైనను వాని జయింపలే రనిన్.

1883