Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/648

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రామునివిజయంబునకుఁ దనపరాజయంబునకుఁ జింతించుచు శోకార్ణవమగ్నుం
డై దరి చేర నుపాయంబు లేక తిరుగుడు పడుచున్నతండ్రి నవలోకించి రాక్షస
శ్రేష్ఠుం డైనయింద్రజితుం డి ట్లనియె.

1568

ఇంద్రజిత్తు తాను యుద్ధమునకుఁ బోయెదనని రావణు నూఱడించుట

చ.

దనుజవరేణ్య యెవ్వఁ డరిదర్పహరం డన వన్నె కెక్కె నె
వ్వనిపటుబాణవీథిఁ బడి వాసవుఁ డైన మనంగఁ జాలఁ డా
ఘనభుజుఁ డగ్నికల్చుఁడు జగన్నుతవిక్రముఁ డింద్రజిత్తు నీ
తనయుఁడు గల్గి యుండ మదిఁ దద్దయు నీకు విచార మేటికిన్.

1569


చ.

నిరుపమమచ్ఛరాసనవినిర్గతబాణవికీర్ణదేహు లై
కరము గతాసు లై నిశితకాండసమాచితసర్వగాత్రు లై
దురమునఁ గూలియున్న హరితుల్యుల రాజకులప్రదీపులన్
సరసుల రామలక్ష్మణులఁ జయ్యనఁ జూచెదు నేఁ డధీశ్వరా.

1570


ఉ.

పౌరుషదైవయుక్త మయి పాటికి నెక్కిననాప్రతిజ్ఞ నిం
పార వినుండు తొల్లి బలయజ్ఞమున న్హరివిక్రమంబున
ట్లారయ వేల్పు లందఱు మదద్భుతవీర్యముఁ జూడ రామునిన్
వారక వానితమ్ముని నవార్యశరంబుల నేఁడు ద్రుంచెదన్.

1571


క.

అని పలికి యద్ధశానన, తనయుఁడు త్రిదశేంద్రరిపుఁడు దారుణసత్వం
బనువంద ఘోరతనుఁ డై, జనకునకుం జెప్పి వేగ సంగరకాంక్షన్.

1572


చ.

హరిరథసన్నికాశము ననర్హమణిధ్వజహేమఘంటికా
పరికలితంబు నుజ్జ్వలము పావనవేగతురంగయుక్త మ
త్యురుతర మైనదివ్యరథ ముద్ధతి నెక్కి నితాంతతేజ మం
బరమున నిండ నేగె నసమానరయంబున జన్యభూమికిన్.

1573


శా.

ఈరీతిం జనువానివెంట ఘనమత్తేభంబులం దేరులన్
సారాశ్వంబుల నెక్కి తోమరధనుశ్శస్త్రంబులం దాల్చి దే
వారు ల్శూరు లనేకు లేగిరి మహాహంకారు లై యాజి కిం
పార న్బృంహితనేమినాదపటుహేషారావము ల్మీఱఁగన్.

1574

ఇంద్రజిత్తు యుద్ధమునకు వెడలుట

చ.

పరశుగదాకృపాణములు ప్రాసపరశ్వథశూలకుంతము
ద్గరముసలంబు లుగ్రపరిఘంబులు గైకొని తత్ప్రదీప్తు లం
బరపథ మాక్రమింపఁగ నిభంబులకైవడి మత్తు లై బలా
రిరిపుపదాతు లేగిరి ధరిత్రియు మిన్నును గంప మొందఁగన్.

1575


క.

భేరీస్వనములు పటుశం, ఖారావము లుగ్రకాహళార్భటులు సుప
ర్వారాతులకలకలములు, దారుణగతి నొక్కభంగి దళముగ మ్రోసెన్.

1576