Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బరిగి సురేంద్రనందనబాహుపాలితం బైనకిష్కింధాపురంబు నవలోకించి శ
త్రువధార్థంబు లతావితానరంజితనికుంజపుంజంబులమాటునం బొంచి యుండి
రి సుగ్రీవుండు విపులగ్రీవుండై కాననంబున నలుదెసలు పరికించి కేవలం బగు
క్రోధం బంగీకరించి పరివారపరివృతుం డై వాయువేగపురస్సరం బగుమహామే
ఘంబుకరణి నంబరంబు పగుల గర్జించి బాలార్కసదృశుండును దృప్తసింహ
గమనుండునై క్రియాదక్షుం డగురఘుహర్యక్షు నవలోకించి యి ట్లనియె.

356


మ.

జయయంత్రాఢ్యయుఁ గీశవాగురయు భాస్వత్స్వర్ణసాలాభ్యుదా
రయు దేవేంద్రజబాహుపాలితయు నై రాణించు కిష్కింధకు
న్నయ మారం జనుదెంచి తీవు ప్రతిన న్సాఫల్య మొందింప వే
దయతో నాగత మైనకాలము మహాత్మా నూత్నవల్లింబలెన్.

357

రాముఁడు సుగ్రీవునితో వాలిని యుద్ధమునకుఁ బిలువు మనుట

వ.

అనిన విని శత్రుసూదనుం డగు రాముండు సుగ్రీవు నవలోకించి
యిట్లనియె.

358


సీ.

ఈగజపుష్పిచే నిటు కృతాభిజ్ఞానచిహ్నుండ వైతివి చింతయేల
పగతునిదెసఁ బుట్టు పగయు భయంబును రణమున బాణమోక్షణముచేతఁ
బాయఁ జేసెద నాకు భ్రాతృరూపకుఁ డైనశత్రునిఁ జూపుము సంభ్రమమునఁ
బలుకులు వేయేల పగతుఁడు నాదృష్టిపథమునఁ బడి వెండి బ్రతికి పోయె


తే.

నేని యవ్వల నాకడ కేగుదెంచి, తివిరి దోషిఁగా నెంచి నిందింపు మపుడు
సప్తసాలంబులును ఘోరసాయకమున, నవనిఁ గూలుట దీనికి సాక్షి గాదె.

359


తే.

హరివరేణ్య నాచేత నేకాంబకమున, విఱిగి యాసప్తసాలము ల్వెస ధరిత్రిఁ
బడుట వీక్షించితివి గదా బలవిరోధి, తనయుఁ డాచందమున నేఁడు ధరణిఁ గూలు.

360


తే.

వృక్షచరనాథ యేను మున్నెన్నఁ డైన, నెట్టియాపదలం దైన నించుకైన
బ్రమసి యైనను బొంకులఁ బలికి యెఱుఁగ, నిపుడు నామాట కనృతత్వ మేల కలుగు.

361


క.

అమరపతి వృష్టిచే స, స్యమునుం బలె మత్ప్రతిజ్ఞ ననఘ ఫలోపే
తముగాఁ జేసెద నిఁక సం, భ్రమమును సంశయము భయము మానుము మదిలోన్.

362


క.

ఏనీనదము విని చెచ్చెర, నానగచరుఁ డనికి వచ్చునట్టి యహీన
ధ్వానం బొనర్చు మిపు డా, హ్వానార్థము భయము దక్కి వానరవర్యా.

363


ఉ.

ఆనినదంబు కర్ణపుట మంటినయంతనె లేచి తప్తజాం
బూనదమాలి వాలి వెసఁ బోరికి వచ్చు నతండు మున్ను నీ
చే నవిధర్షితుండు జయశీలుఁడు బాహుబలాధికుండు తే
జోనిధి సంగరప్రియుఁడు శూరుఁ డరిందమమాని గావునన్.

364

సుగ్రీవుఁడు వాలి వచ్చుటకై సింహనాదము సేయుట

తే.

వినుము సంగరదూరులు విమతజనుల, ధర్షణంబు సహించరు తపనతనయ
మఱి విశేషించి సతులసమక్షమందు నున్నచో బీర మెక్కుడై యుండుఁ గాదె.

365