Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

పంకజేక్షణ నేత్రాంతపాణిపాద
తలనఖములందు రక్తిమ గలిగి యునికి
వాసవసమానుఁ డైననీవల్లభుండు
పొందుగఁ ద్రితామ్రుఁ డన ధాత్రిఁ బొగడు వడసె.

774


తే.

తుహినకరముఖి ఘనశిరోరుహవరాంగ
ములను మఱియును బాదరేఖలను దనరు
చారుసుస్నిగ్ధతావిశేషంబు గలిగి
యునికి ద్రిస్నిగ్ధుఁ డనఁ జాల వినుతి గాంచె.

775


క.

స్వరమును సత్త్వము నాభియు, నురుతరగాంభీర్య మొందియుండుటవలనన్
సరసిజముఖి నీవల్లభుఁ, డరయఁ ద్రిగంభీరుఁ డనఁగ నభినుతి కెక్కెన్.

776


క.

ధ్రువముగ నుదరతలంబున, యువతీ కంఠమునఁ ద్రివళు లుండుటవలనన్
దివిజేంద్రనిభుఁడు రాముఁడు, త్రివళీవంతుఁ డన నభినుతిం గాంచె నిలన్.

777


క.

వనజాక్షి పాదరేఖలు, ననువుగ స్తనచూచుకంబు లవనతములు నై
దనరారుఁ గాన నీవిభుఁ, డనఘుఁడు త్ర్యవనతుఁ డనంగ నభినుతి కెక్కెన్.

778


తే.

పద్మలోచనకంఠంబు ప్రజననంబు
జంఘికలు పృష్ఠ మరయు హ్రస్వంబు లగుట
వలన రఘువల్లభుఁడు చతుర్వ్యంగుఁ డనఁగ
జగతి లక్షణవిదులచేఁ బొగడు వడయు.

779


క.

అరయఁగ నావర్తత్రయ, పరివేష్టితశీర్షుఁ డగుటఁ బార్థివపుత్రీ
ధర లక్షలజ్ఞు లారఘు, వరుని నుతింతురు త్రిశీర్షవంతుం డనుచున్.

780


తే.

పుణ్యసాధ్వి తదంగుష్ఠమూలమందు
శ్రుతిచతుష్టయసంప్రాప్తి సూచకాభి
లలితరేఖాచతుష్టయం బలరు చున్కి
సన్నుతింతురు దగఁ జతుష్కలుఁ డటంచు.

781


తే.

తామరసనేత్ర తత్పాణితలములందుఁ
దగ లలాటంబునందుఁ బాదంబునందుఁ
బరఁగ రేఖలు నాలుగు వఱలు చునికి
క్షితిఁ జతుర్లేఖుఁ డనఁగ విశ్రుతి వహించు.

782


వ.

మఱియుఁ జతుర్వింశత్యంగుష్ఠాత్మకం బైనహస్తంబు కిష్కు వనం దగునట్టికిష్కు
చతుష్టయప్రమాణదేహంబు గలవాఁడు గావునఁ జతుష్కిష్కుం డతం డగు
నదియునుం గాక.

783


తే.

తొడలు మోఁకాళ్లు మఱియు జేతులును బిక్క
లరయ నీనాలుగు సమంబు లగుటవలనఁ