Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భూతనయ యిట్టిదుఃఖంబుఁ బొందవలసెఁ
గాలము దురత్యయం బెంతఘనున కైన.

406


ఆ.

రామువిక్రమంబు సౌమిత్రితేజంబు, నెఱిఁగి యున్న దగుట నీమృగాక్షి
జలదకాలగంగచాడ్పున క్షోభింప, కున్న దిపుడు ధైర్య మూఁతఁ జేసి.

407


క.

సమశీలవయోవృత్తయు, సమాభిజనలక్షణ యగుజానకికి రఘూ
త్తముఁడు దగు నవ్విభున కీ, యమ దగు దాంపత్య మింతయర్హం బగునే.

408


వ.

అని పెక్కుతెఱంగులం దలపోసి మలినసంవీతత్వోపవాసకృశత్వశోకధ్యాన
పరాయణత్వాదిపతివ్రతాదిధర్మయుక్త యై లోకకాంత యగురమాదేవియుం
బోలె నొప్పుచున్నసీత నవలోకించి శోకహర్షకలితుం డై యీత్రిలోకసుందరి
రామునిభాగ్యంబున జీవించి యున్నదని రామునిం బ్రశంసించి వెండియుఁ దన
మనంబున.

409


సీ.

ఈకాంతకై కాదె యినకులాధీశుండు ఘనరూపుఁ డగువిరాధుని వధించె
నీయింతికై కాదె యించె రాక్షసి కర్ణనాసికము లక్ష్మణునిచేత
నీకాంతకై కాదె వీఁకతో రావణప్రతిముఁ గబంధునిఁ బట్టి చంపె
నీలేమకై కాదె లీలతోఁ బదునాల్గువేలరక్కసుల వావిరి వధించె


తే.

నీజలజనేత్రకై కాదె యోజ మెఱసి, ఖరుని ద్రిశిరుని దూషణుఁ గలనఁ ద్రుంచె
మఱియు నీరామకై కాదె హరివరేణ్యు, ఘోరరూపుని వాలిని గూల వైచె.

410


తే.

భానుజుఁడు దుర్లభం బైనప్లవగరాజ్య, మొందుటయు నేను గడిమిమై నుదధి దాఁటి
వచ్చుటయు వేగ యీలంకఁ జొచ్చుటయును, బరఁగ నీపంకజేక్షణకొఱకుఁగాదె.

411


తే.

ఈచకోరాక్షికొఱకు నై యినకులుండు, జలధిపర్యంత మైనక్ష్మాతలమ గాదు
కెరలి ముల్లోకములు తలక్రిందు గాఁగఁ, జేసినను యుక్త మని యెంతుఁ జిత్తమందు.

412


తే.

అఖిలలోకైకసామ్రాజ్య మది యధికమొ
జనకనందని యధికమో యని తలంప
నఖిలవిష్టపసామ్రాజ్య మాధరిత్రి
పుత్రికకలాంశ మైనను బోల దరయ.

413


మ.

ధర భేదించి సరోజరేణునిభకేదారస్ఫురద్ధూళిచే
సిరి యొప్పారు హలాసనక్షతమఖక్షేత్రంబునం బుట్టి శ్రీ
కరసంస్తుత్యగుణాఢ్యుఁ డైనజనకక్ష్మాభర్తకుం బుత్రియై
స్థిరలో వన్నియఁ గన్న దీసుదతి పాతివ్రత్యధర్మంబునన్.

414


వ.

అదియునుం గాక.

415


చ.

అరిజయశీలుఁ డాదశరథావనిభర్తకు ముద్దుఁగోడలై
వరనృపమౌళిరత్నరుచిభాసితపాదకుఁ డైనరామభూ
వరునకుఁ బత్నియై జగతి వాసికి వన్నెకు నెక్కె నేఁటికి