Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

జానకిఁ గాన కే నిపుడు సమ్మతి నేగినఁ జూచి రాఘవు
ల్వానరు లార్తి మేను విడువం గల రిచ్చటఁ జత్తు నంటినా
మానినివార్తఁ గానక క్రమంబునఁ జత్తురు రెంట దోషము
న్మానక గల్గు నిచ్చటనె మౌనివిధంబున నుండు టొప్పగున్.

351


క.

కావున నే నటు పోవక, పానకశిఖలందు మేనుఁ బాయక యిచటన్
జీవంబు నిలిపికొని ముని, నై వనమున నియతి నుండ నర్హుఁడ నైతిన్.

352


వ.

మఱియు వినాశంబునందుఁ బూర్వోక్తబహువిధదోషంబులు సంభవించు బ్రతికి
యున్న శుభంబులు పడయవచ్చుఁ గావునఁ బ్రాణంబులు ధరించియుండెద జీవిత
సంగమంబున మంగళంబు ధ్రువంబు గదా యని యిట్లు బహుప్రకారంబులఁC
జింతించి సారెసారెకు దుఃఖంబు మనంబున ధరించుచు శోకంబునకుఁ దుదఁ గా
నక సీతాదర్శనాభావసంజాతశోకజనితదురంతక్రోధవివశాత్మకుం డై వెండియు
ని ట్లని వితర్కించు.

353


క.

మచ్చరమున వైదేహిని, మ్రుచ్చిలి కొని తెచ్చినట్టి మూఢు దశముఖున్
వ్రచ్చి వధియించి పుచ్చెద, నచ్చుపడ నది ప్రతికార మగు దాని కొగిన్.

354


క.

దశముఖదైత్యాధిపుఁ గొని, విసువక జలరాశి దాఁటి వెస రామునకు
న్బిశితోపహార మిచ్చెదఁ, బశుపతికిం బశువుఁ బట్టి బలి యిచ్చుక్రియన్.

355


వ.

ఏను సీతం జూడకయే సంపాతివచనంబు విశ్వసించి రాముని గొని తెచ్చితినేని న
మ్మహాత్ముం డద్దేవి నిచ్చటం గానక కోపవిశేషంబున వానరుల నెల్ల దహించుఁగదా
యని యి ట్లనేకప్రకారంబుల వితర్కించి నా కిప్పుడు వేగిరపడ నేల జనకనందనిఁ
గనుఁగొనునందాఁక నీలంక నిశ్శంకముగానుండి గ్రమ్మఱ వెదకెద మత్కృతంబున
సర్వవానరులు నశింపకుందురు గాక ముందట నొక్కమహోన్నతం బైనమహో
ద్యానంబు నయనాభిరామం బై వరసంస్కారసంస్కృతం బై యొప్పుచు నొప్పా
రెడు నింతకుము న్నావనంబు పరికింప వనపాలకు లగురాక్షను లచ్చటనుండి
పాదపంబుల రక్షించుచున్నవారు గంధవహుండు తత్పరిసరంబున నురవడి మెలం
గ వెఱచి మెల్లనం బొరయుచున్నవాఁ డందు జానకి యుండ నోపు వసురుద్రా
దిత్యమరుదశ్వులకు నమస్కరించి రాక్షసులకు శోకవర్ధనకరుండ నై యివ్వనంబుఁ
జొచ్చి యడ్డంబు వచ్చిన రాక్షసులు జయించి సీతం గాంచి తపస్వికిఁ దపఃఫలం
బుం బోలె రామచంద్రున కద్దేవి సమర్పించెదఁ గాక యని నిశ్చయించి పరిశుద్ధం
బగుతనమనంబున.

356


ఉ.

దండము రాఘవేంద్రులకు దండము మైథిలరాజపుత్రికిన్
దండము చంద్రసూర్యులకు దండము ధాతకు శేషశాయికిన్
దండము వాయుకాలురకు దండము వజ్రకి శూలపాణికిన్
దండ మటంచు భక్తిమెయి దక్షత వారికి మ్రొక్కి వెండియున్.

357