Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని పలికి మహాబలనందనుం డాశైలంబుపైఁ గేలూది ప్రసన్నవదనుం డై
యచటు వాసి సముద్రపర్వతంబులు జాతకౌతూహలంబు లై తన్ను విలోకించి
యనేకవిధంబుల నాశీర్వదింప నిరాలంబం బగుగగనంబున కెగసి యమ్మహాగిరి
నవలోకించుచు వాయుమార్గంబున నమోఘరయంబునం జనియె నప్పుడు
రెండవదియైన తదీయదుష్కరకర్మంబుఁ జూచి దేవర్షిగంధర్వసిద్ధవిద్యాధరులు
పరమానందభరితాంతఃకరణు లై సాధువాక్యంబులం బ్రశంసించి రంత సహ
స్రాక్షుండు హిరణ్యనాభం బగుమైనాకంబుకడకుం జనుదెంచి మైత్రి నెఱపు
చుఁ బ్రమోదవిశేషంబున ని ట్లనియె.

86

ఇంద్రుఁడు మైనాకపర్వతమునకు వర మొసంగుట

చ.

ధరణిధరేంద్ర నిర్జరహితంబుగఁ బుట్టిన రామభర్త కి
ట్లిరవుగ దౌత్యము న్నెఱప నేగెడు నీవిపినాట మౌళికిం
గరము సఖుండ వైతి వటుగావున బంధుఁడ వీవు నాకు న
త్యురుతరపక్షయుగ్మమున నుర్విఁ జరించుచు నుండు మెప్పుడున్.

87


క.

నా కులిశము వలని భయము, నీ కెన్నఁడుఁ గలుగ దింక నీవు ముదముతో
లోకములకు ముద మొసఁగుచుఁ, జేకొని చరియింపుమయ్య శీతాద్రిసుతా.

88


క.

అని పలికి పాకశాసనుఁ డనిమిషపురి కరుగ నమ్మహాశైలము చ
య్యన నింద్రువరముఁ గైకొని, తనమనమున భయము విడిచెఁ దద్దయుఁ బ్రీతిన్.

89


వ.

ఆసమయంబున.

90


క.

సురమును లాహనుమంతుని, గురువీర్యము బలము నెఱుఁగఁగోరి రయమునన్
సురస యనునాగమాతను, బరికించి యుదంచితోక్తిఁ బలికిరి నెమ్మిన్.

91


ఉ.

ఇక్కపివీరుఁ డొక్కరుఁడె యేగెడు లంకకు నం దసంఖ్యు లై
రక్కసు లున్నవా రితనిరంగును వారిబలంబు లెట్లొకో
యెక్కువ తక్కువల్ దెలియు టెంతయు లెస్సయి యుండుఁ గాన నీ
వొక్కముహూర్తమాత్రము సముద్ధతి విఘ్న మొనర్పు త్రోవకున్.

92


వ.

మఱియుఁ బర్వతోపమం బైనఘోరరాక్షసశరీరంబు గైకొని గగనసమంబును
దంష్ట్రాకరాళపింగాక్షంబు నగువదనంబుతో నడ్డంబు చను మతండు ని న్నుపా
యంబున నిర్జించి చనునో విషాదంబు నొందునో యెఱుంగవలయు నని పలికిన
నాసురస యౌఁగా కని రయంబున.

93


ఉ.

లోకభయావహంబు నతిలోకము నైననిశాటిరూపముం
గైకొని యంజనాచలముకైవడి మే నమరంగఁ గిన్కతో
నాకసమందు మారుతరయంబున మబ్బులఁ దూలఁ దోలుచున్
వీఁక దలిర్ప నేగు కపివీరున కడ్డము నిల్చి యి ట్లనున్.

94