Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దృఢతరబాహువీర్యు లతిధీరులు కాంచనశైలసన్నిభుల్
కడువడి మూఁడుకోట్ల ప్లవగప్రవరుల్ రవిపుత్త్రువీటి కిం
పడరఁగ నేగుదెంచి రపు డద్భుతభంగి దివంబు ఘూర్ణిలన్.

929


చ.

ప్రతిదివసాంతమందును బ్రభాకరుఁ డచ్చట నస్తమించు నా
క్షితిధరకోటిపై నునికిఁ జేయుచు నున్నసువర్ణవర్ణు ల
ప్రతిమపరాక్రము ల్గిరివరప్రతిభు ల్దశకోటివానరుల్
ధృతి సెలఁగంగ వేగ చనుదెంచిరి సూర్యజురాజధానికిన్.

930


తే.

సింహకేసరవర్ణులు సింహబలులు, సింహవిక్రాంతగమనులు సింహసములు
కీశు లొకవేయికోట్లు కిష్కింధ కపుడు, రజతగిరినుండి వచ్చిరి రయము మెఱయ.

931


చ.

చలిమల నాశ్రయించి వరుస న్ఫలమూలము లాహరించుచు
న్బొలుపుగఁ దద్గుహాగహనభూములఁ ద్రిమ్మరువారు సంచల
త్కులగిరిసన్నికాశు లొకకోటిసహస్రసహస్రవానరుల్
చలమున నేగుదెంచిరి దళంబుగ భానుజుఁ డేలువీటికిన్.

932


క.

ఘోరాంగారకతుల్యులు, దారుణవిక్రములు కపివతంసులు వేగం
బారఁగ సహస్రకోటులు, వారక వింధ్యమున నుండి వచ్చిరి వరుసన్.

933


వ.

మఱియు నానావనోపవనగిరిగహ్వరసరిత్సరోవరనివాసులును క్షీరోదవేలానిల
యులును దమాలవనవాసులును నారికేళాశనులును నగువానరు లసంఖ్యేయులు
మార్తాండమండలంబు నిరోధించుచు శీఘ్రంబుగఁ గిష్కింధకుం జనుదెంచి
తత్పట్టణబాహ్యాంతరదేశంబులు నిండి చెలంగి రంత.

934


క.

ధరణిఁ గల కపుల నందఱ, వరుసం దోడ్తేరఁ జనినవానరవరు లా
గిరిచరుల కందఱకుఁ గపి, వరునానతిఁ దెల్పి మరల వచ్చుచుఁ ద్రోవన్.

935


సీ.

ఎచ్చట మున్ను మాహేశ్వరం బగుయజ్ఞ మఖిలదేవస్తుత్య మై తనర్చె
నట్టిహిమాచలం బల్లన వీక్షించి యందు దివ్యాన్ననిష్యందజాత
ఫలమూలములు గాంచి యిల నెవ్వఁ డెద్దాని నొకమాటు భుజియించి యొక్కమాస
మాఁకటఁ బడకుండు నట్టి దివ్యామృతస్వాదుకల్పము లగుసరసదివ్య


తే.

మూలఫలములు నోషధిజాలములును
సురభిపుష్పంబులును గొంచు సురుచిరముగ
యూథపులు శీఘ్రజవమున నుష్ణకరుని
సుతుని వీటికి వచ్చిరి సొంపు మీఱ.

936


తే.

వచ్చి సుగ్రీవుఁ గనుఁగొని వరుసతోడఁ
దాము దెచ్చినబహుపదార్థంబు లన్ని
కాన్క లర్పించి యంజలికలితు లగుచు
విన్నవించిరి మెల్లన వినయ మెసఁగ.

937