పుట:కేయూరబాహుచరిత్రము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

25

క. తొల్లి యుగసంధి నొకతఱి, నెల్లెడఁ బొడవడఁగఁ దాప మెక్కుడు గా
     ధిల్లె నొకవఱపు ప్రాణులు, తల్లడిలఁగ నిడివియగుచు ధరణి కడంకన్.12
వ. ఆక్కాలంబున.13
సీ. పసిమి యెచ్చట లేక పాడగుటకుఁ దోడు పాతాళమునదాఁకఁ బగిలె నేల
     బిలములు వ్రయ్య లై నెలవు లేమికిఁదోడు హీనజంతువు లెల్ల నివికె నెండఁ
     జండాతపముచేత నెండిపోకకుఁదోడు ద్రుమములఁ బెనుగాలి తుమురుసేసె
     నాఁకలి నీరువ ట్టనుచిచ్చునకుఁదోడు కార్చిచ్చు మృగములఁ గాల్పఁ దొడఁగెఁ
గీ. నాపదల మదనాపద లావహిల్లె, వట్టిపోయిన డొక్కలు వాము లయ్యె
     నివుఱుబొగ్గులప్రోవులు నిఖిలదిశల, నధికదుస్సహమయ్యె నయ్యడవియందు.14
క. పరిపూర్ణోదక మై కడు, నిర వగునొకకూపమున ననేకంబులు ద
     ర్దురములు బహువర్ణంబులు, పరఁగు సుహృద్భ్రాతృపుత్రపౌత్రయుతము లై.15
వ. ఇట్లన్నియుం దమకు మహావేగుం డనునొకచక్కనిమండూకంబు రాజుఁగా నిలు
     పుకొని సుఖం బుండునంత.16
క. ప్రియబంధు లెల్లవారును, లయ మందినఁ దాను జాల లావఱి కంఠా
     శ్రయజీవన మై తిరిగెడు, భయదర్శక మనఁగ నొప్పు పా మచ్చోటన్.17
క. మండూకనినాదము విని, నిండినసంతసముతోడ నీరుండనిచో
     నుండ వివి యచట నుదకము, లుండంగఁబోలు నని మేన నుమ్మసలారన్.18
మ. కదియం జయ్యన వచ్చి నాగ మచటం గాంభీర్యసంపత్తికిం
     గుదు రైయుండెడునూయిఁ గాంచి మదిఁ గోర్కుల్ నేఁడు సేకూఱఁ బో
     వుదు నాతృష్ణ బుభుక్ష యిప్పుడ వెసం బుత్తు న్మహావగ్రహా
     స్పదదుష్కాలదినంబు లెల్ల నిచటన్ సమ్యక్సుఖావాసి నై.19
క. చెఱవెడలఁ డెఱువుఁ గానక, దరి నుండుచు లోన నుండు దర్దురనాథున్
     బరిమితపరిజనపరివృతు, నిరవున నున్నతనిఁ జూచి యి ట్లని పలికెన్.20
శా. దేవా! భేకకులాధినాథ! కరుణాదృష్టి న్ననుం జూడవే
     జీవం బుండదు నీరువట్టుకతనన్ శీఘ్రంబ నిం గొల్వరాఁ
     ద్రో వేదిక్కునఁ గాననేర మదిలో దుఃఖంబునం బ్రుంగెదన్
     నీవారిం గలయంగ రాఁ బనిచి మన్నింపంగదే వేఁడెదన్.21
క. మా పెద్ద లెఱుక సాలక, మీ పెద్దల కెగ్గు నేసి మలఁగుట చెయ్దం
     బాపికొనవలయు నను నీ, శ్రీపాదసమీప మిపుడు చేరితి కొల్వన్.22