పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xviii

కృష్ణమూర్తి తత్వం


లెడ్ బీటరుకు ప్రాచ్యదేశాల మార్మికతత్వంలో ఆసక్తి వున్నది. దానితో పాటు అతనిలో అధికారం చలాయించే స్వభావమూ, వలసరాజ్య పాలకవర్గంలో వుండే లక్షణాలు మితిమీరిన ధోరణీ కూడా వున్నాయి. లెడ్ బీటరుకు సాహసకృత్యాలంటే మహా యిష్టం; దానికి తోడు విపరీతమైన వూహాలోక సంచారత్వం; వీటివల్ల అతడు తన జ్ఞాపకాలకు కూడా రంగులు అద్దుతాడు. ఎంతగా అంటే అతడి జీవితంలో జరిగిన సంఘటనలే అతడు తిరిగి చెప్పినప్పుడల్లా యింకా యింకా అద్భుతంగా ధ్వనిస్తుండేవి. వ్యక్తుల చుట్టూ వుండే 'తేజోవలయాలను' పరికించడం, వారి 'పూర్వజన్మల'ను చదవడం, రహస్యనిగూఢ పద్ధతులు సాధనచేయడం మొదలైన వాటిల్లో అతడికి చాలా ప్రావీణ్యం వుండేది. ప్రధమ పరిచయం అయీ అవగానే తన భవనానికి కృష్ణమూర్తిని తీసుకొని రమ్మని లెడ్ బీటరు నారాయణయ్యను ఆదేశించాడు. ఒక సోఫాలో తన పక్కనే ఆ చిన్న పిల్లవాడిని కూర్చోబెట్టుకున్నాడు. తన చేతిని ఆ పిల్లవాడి తలమీద పెట్టి నాటకీయంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. అందులో చిలవలు పలవలుగా మలుపులు తిరుగుతున్న ఎన్నో కధలు సాహస కృత్యాలలో, స్వార్ధత్యాగాలతో కూడుకున్నవి దొర్లిపోయాయి. వాటన్నింటిలోనూ కధానాయకుడు అల్సేయన్- అది కృష్ణమూర్తికి మారు పేరు అని కూడా చెప్పాడు. చిక్కగా అల్లుకొని పోయిన యీ కథనమంతా వ్రాతరూపంలోకి మార్చి 'అలసియన్ జీవితాలు' అనే పుస్తకంగా ప్రచురించాడు. ఈ కధల్లో శ్రీమతి బెసెంట్ మొదలైన దివ్యజ్ఞాన సామాజిక సభ్యులు కూడా దర్శనమిస్తారు. అయితే భూలోకంలోనూ, అనేక యితర గ్రహలోకాల్లోనూ వారు సంచరించినప్పుడు ఆయా చారిత్రక కాలాలకు అనుగుణంగా రకరకాలైన వేరు వేరు రూపాలను వారు తాల్చుతారు. ఒకరోజు ఆరుబయట డాబా మీద యీ పూర్వ 'జీవితాల' ను లెడ్ బీటరు అందరికీ చదివి వినిపింప జేశాడు. శ్రోతలు వుద్వేగంతో పులకించి పోయారు.

కృష్ణమూర్తికి అతని గతజన్మల పట్టికనొకటి తయారుచేసి యిచ్చాక, లెడ్ బీటరు అతన్ని అతడు పుట్టిన వాతావరణం నుండి, అతని కుటుంబం నుండి, దివ్యజ్ఞాన సమాజపు ప్రహరీగోడకు బయటవైపు శిధిలావస్థలో వున్నవారి చిన్న యింటి నుండి యీ వైపుకు లాగుకొని రావడానికి శతవిధాలా ప్రయత్నం చేశాడు. తన కొడుకులను మైలాపూరు పారశాలకు పంపడం ఆపివేయమని నారాయణయ్యకు నచ్చజెప్పడం లెడ్ బీటరు ప్రయత్నాల్లో మొదటిది. "బూట్ల తాళ్ళు అమ్ముకోవలసినవాడు వుపాధ్యాయుడి పిల్లలను కొట్టి హింసిస్తున్నాడని" అతని వాదం. వారికి చదువు నేర్పడానికి కొందరు పాశ్చాత్య అధ్యాపకులను ఏర్పాటుచేసి, పై నుంచి తాను పర్యవేక్షణ