పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్మమూర్తి వికాసోదయం

xi

ప్రణాళికలో మెకానిక్స్, హైడ్రాలిక్స్, ఆప్టిక్స్ ను కూడా చేర్చాలని నిర్ణయం తీసుకోవడంలోనూ కనబడుతుంది.

ఈ విధంగా యూరప్, భారతీయ సంస్కృతుల మధ్య పోటీ సాగుతున్నది. అందులో ఒకటి వలస రాజ్యాధిపతులకు చెందిన సంస్కృతి. అటువంటి పరిస్థితుల్లో పరిపాలిస్తున్న ప్రభువులకీ, దాస్యంలో వున్న ప్రజలకీ మధ్యన సంబంధాలలో అస్పష్టత, అపనమ్మిక, వుద్రిక్త వాతావరణం వుండటం సహజమే కదా. అయితే మెకాలే పొత సంప్రదాయాలను త్రో సేసి ఆధునికత్వాన్ని ఎన్నుకోవడం రాజా రామమోహనరాయ్ వంటి మేధావులను యూరప్ సంస్కృతివైపు మొగ్గేటట్లుగా చేసింది. అదే ఆ కాలానికి సబబైన మార్గంగా వారికి తోచింది.

భారత రంగంమీద యీ రకమైన వాద వివాదాలు ఎన్నో జరుగుతున్నాయి. అయితే కృష్ణమూర్తి తల్లిదండ్రులు వున్న ప్రపంచం వేరు జన్మతః బ్రాహ్మణులు కాబట్టి అనూచానంగా వస్తున్న భాషా పాండిత్యాలకూ, మత సంప్రదాయాలకూ వారు వారసులు. అయితే తాత ముత్తాతలు కాలానుగుణంగా వస్తున్న మార్పులు గ్రహించి, సంప్రదాయ బద్ధమైన తమ జీవన సరళిలో నుంచి యివతలగా వచ్చి, విశాలమైనా యింకా పరాయిదే అయిన యింగ్లీషు భాషా ప్రపంచపు మారుమూలల్లో చిన్న చిన్న వుద్యోగాలు సంపాదించుకున్నారు. అయితే, వుద్యోగాల్లో చేరినా వారు తరతరాలుగా వస్తున్న తమ ఆచార వ్యవహారాలను వదులుకోలేదు, సద్బ్రాహ్మణుని దైనిక జీవితాన్ని కుటుంబంతో, సమాజంతో, వూర్ధ్వలోకాలతో అనుసంధించే తమ కర్మకాండల అనుష్టానాలలో విశ్వాసాన్ని చెదిరిపోనీయలేదు.

పందొమ్మిదో శతాబ్దంలో సాధారణమైన బ్రాహ్మణ గృహంలో కుటుంబ జీవనం పరిమితులు గల పరిధిలోనే తిరుగుతూ వుండేది. అక్కడ బయట ప్రపంచంమీద ఆధారపడటం లేదు, దానికదే ఒక స్వయం సంపూర్ణమైన దినచక్ర క్రమం. పుత్రసంతానంమీద విపరీతమైన శ్రద్ద చూపేవారు, దేవుళ్ళనూ, దేవతలనూ అధివసింపజేసి, వారి చుట్టూ పూజా పునస్కారాలూ, వ్రతాలూ చేసి, అజ్ఞాత భయంకర శక్తులనుంచి అవి తమని కాపాడుతాయనుకునేవారు. కొడుకుల అభీష్టాలకు ఏమాత్రం అడ్డుతగలకుండా ప్రవర్తించేవారు. కృష్ణమూర్తి జన్మించిన మర్నాడు ఒక జ్యోతిష్యుడిని పిలిచారనీ, జాతక చక్రం వేయించారనీ, అతనికి గొప్ప భవిష్యత్తు పున్నట్లుగా అందులో వ్రాసి వుందనీ అంతా చెప్పుకుంటారు. కొంత కాలానికి పూర్వ సంప్రదాయానుగుణంగా కృష్ణమూర్తికి అక్షరాభ్యాసం చేశారు. అంటే, వెండి కంచంలో బియ్యం పోసి, అతనిచేత ఇందులో ఓం అనే అక్షరం దిద్దించారు.