పుట:కాశీమజిలీకథలు -01.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

పోనిండు. మేము భుజింపవలయు నట్టి సదుపాయ మెక్కడ జరుగును. ఎందైన సత్రమున్నదియా?

రాజ - (అత్యాగ్రహముతో) మేము పురరక్షకులముగాని పరదేశులకు భోజనసదుపాయము జేయువారమును సత్రముల నెఱింగించువారమును గాము. రాత్రుల వీథుల నితరులు సంచరించుటకు రాజుగారి యాజ్ఞలేదు. ఎక్కడైనను సత్వరముగాఁ బండుకొనుఁడు లేనిచో శిక్షింతుము.

వర - ఊరక యాగ్రహపడెదరేమి? పరదేశస్థులకు బస జూపినంత మాత్రముననే యధికారమునకు లోపమువచ్చునా?

రాజ - లోపము వచ్చును. అది మా పనికాదు. వేగిరము పండుకొనుఁడు.

నిలుఁడు నిలుఁడని గుఱ్ఱంబుల కడ్డునిల్చుటయు వారు గ్రొత్తవారగుట నేమియుం బలుకనేరక గుఱ్ఱంబుల డిగ్గి వారి శాసనమునకు లోనై ప్రాంతముననున్న యొకయరుగుమీదఁ బరుండిరి. ఊరక కన్నులు మూసికొనిరిగాని నిద్రపట్టినదికాదు. ఇంతలో సాయంకాల మగుటయు ననఁగా నా గ్రామస్థులకు నది యుదయమే గనుక ప్రాతఃకాలమున లేచునట్లు సాయంకాలమున లేచి జనులెల్లరు క్రమంబున వారివారివ్యాపారములయందు బ్రవర్తింపఁ దొడంగిరి. వరప్రసాదులు పరుండియున్న యింటి యజమానుఁడుతలుపుతెరచి వారింజూచి గొప్పకుటుంబములోనివారిగాఁ దలంచి మిక్కిలిగౌరవముగా అయ్యలారా మీరెవ్వరు? ఈ గ్రామ మెందులకై వచ్చితిరి? మీవృత్తాంత మెఱింగింపుడని యడిగిన ప్రవరుం డిట్లనియె.

అయ్యా! మేము కాశ్మీరదేశస్థులము. గొప్పవంశమువారు విదేశములయందుఁ గల వింతజూచుటకై దేశాటనము జేయుచుంటిమి. ఈ పురము నేఁటి మధ్యాహ్నము జేరితిమి. అట్టివేళ నిద్రించుచున్న జనులఁజూడ మాకు మిగుల వింతయైనది. కారణ మడుగ నిది మధ్యాహ్న మనువారిని దండింతుమని రాజభటులు మమ్ము నరికట్టిరి. మిగుల నాకలితో వారి యాజ్ఞలకు బద్ధులమై మీయరుగుమీదఁ బండుకొంటిమి. ఇంతలో సాయంకాల మగుటయుఁ దెల్లవారినట్లు జనులు వారివారిపనులందు బ్రవర్తింబఁదొడంగిరి. ఇందలివారలు నిశాచరు లగుటకుఁ గారణము తెలియకున్నది. ఈ విశేష మెట్టిదో యెఱింగింప వేడుచున్నారము అని సానునయముగా నడిగినఁ బుణ్యమతియైన యాగృహపతి వారిని లోనికిఁ గొనిపోయి యుచితప్రదేశమునఁ గూర్చుండబెట్టి తృటిలో రుచిగల పదార్థముతో వంటఁజేయించి భోజనముబెట్టి పిమ్మట రహస్యస్థలంబునకుఁ దీసికొనిపోయి సాదరముగా నానగరవృత్తాంత మిట్లు చెప్పందొడంగెను.