పుట:కాశీమజిలీకథలు -01.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వరప్రసాదుల కథ

43

అందఱు — ముమ్మాటికినిఁ బ్రమాణవచనము, ఇప్పుడనుకొనిన సమయమున కాతోటలోనికి రావలయును.

అని యాలోచించుకొని యందఱు గుఱ్ఱము నెక్కి సత్వరముగా నిండ్లకుంజనిరి. ఆ రాత్రియు మఱునాఁడు పగలును బ్రయాణసన్నాహమేకాని యొండు కార్య మేమియు వారెరుగరు. వారట్టి యుత్సాహముతో నుండిరని యొక్కరును గ్రహింపరై రి. ప్రవరుని తల్లి మాత్రము వత్సా! నేఁడిది యేమి? మిత్రులయొద్ద కఱుగక యింటియొద్దనే యుంటివేమి? పుస్తకములన్నియు సవరించుచుంటి వేమిటికి? యెక్కడికైనఁ బ్రయాణము చేయవలసి యున్నదా యేమి? అని యడిగినది. అతం డామె కేదియో సమాధానము జెప్పి మరపించెను.

నాఁటిరేయి నియమించుకొనిన సమయమైనతోడనే యందఱును గుఱ్ఱములెక్కి యెవ్వరికిం దెలియకుండ సాంకేతికమైన యారామమున కరుదెంచిరి.

అందఱును జేరిన వైనము పేరుపేరునం దెలిసికొని కలసికొని మాట్లాడికొని మంగళశ్లోకములం జదువుచుఁ బశ్చిమదిశాభిముఖులై మనుష్యసంచారములేని యొక మహారణ్యమునంబడి నడువసాగిరి. వారి వారువములు ఱెక్కలుగలవియుంబోలె గంచెలం దాటుచు గుట్టల నతిక్రమించుచుఁ బొదల దూరుచు నత్యంతపాటవంబున నేగఁ దొడంగినవి.

మఱియు వసంతుండు ఖడ్గపాణియై యడ్డమైన తరులతాగుల్మాదుల ఖండించుచు ముందుఁ దన ఘోటకమును విన్నాణముగా నడిపించుచుండ రాముఁడును దానియడుగుల నడుగు నిడునట్లు తనకత్తడిని సమవేగంబునఁ బోనిచ్చుచు వసంతుఁడు నఱుకగా మిగిలిన కంటకలతావితానంబుల భజింపుచుండును. అతనిపజ్జ ప్రవరుండును వానివెనుక సాంబుఁడును వానిపిరుందన దండుండు నట్లే తురంగంబులఁ దోలుచుండిరి.

అయ్యరణ్యంబు ముందుఁజూడ దుర్గమంబుగను వారి వెనుకఁ జూడ రాజమార్గంబు గలదిగను గనంబడుటంజేసి యక్కాంతార మక్కుమారశేఖరునకు దారి యిచ్చుచున్నదో యనునట్లు చూడనయ్యెను. అందఱకన్నను వెనుక వచ్చుచున్న దండుఁడు వైద్యశాస్త్రప్రవీణుండును మహాయంత్రనిర్మాణదక్షుండునగుట నయ్యడవి నందందుఁ గాన్పించుచున్న మూలికావిశేషములును యంత్రోపకరణదారుకండంబునను సంగ్రహించుచుండెను.

తమ్ముఁ గానక మరునాఁడు తమవా రేమి చేయుదురో యని తత్కృత్యంబుల గుఱించి సంభాషించుకొనుచు వారట్లు మహావేగంబునఁ బోవుచుండఁ గొంతసేపటికి వారి నిశ్వాసించుటకుంబోలె నంబుజనీకాంతుం డనూరు పురస్సరముగాఁ బూర్వగిరిశిఖర మధిష్టించి యరుణకరప్రసారముల వారిపై వ్యాపింపజేసెను.

అప్పు డొకతటాకవికటంబునఁ దమ హయంబుల నిలిపి యవ్వీరులందుఁ