పుట:కాశీమజిలీకథలు -01.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయలు జనన కథ

29

త్పత్తికి హేతువులు వ్రతదానహోమతర్పణాదులే యగునని తత్ప్రయత్న మాచరించుటకు మిగుల నతని తొందర పుట్టెను.

ఇట్లు వారు మువ్వురు తమకుఁ దోచినవిషయంబులు చెప్పి యూరకున్నంత కళాదుఁడు లేచి అయ్యా! రాజేంద్రా! పుత్రోత్పత్తికి వీరు చెప్పినవన్నియు దైవికములు. కలిగినం గలుగవచ్చును. మానినను మానవచ్చును. దీనికి నే నొండుపాయము మానుషంబైన దానిని వక్కాణింతు వినుఁడు. వైద్యగ్రంథంబులు లెన్నియేని బరిశీలించినాఁడ. వానిలో శరీరశాస్త్రమను గ్రంథంబున దీనివివరము వ్రాయఁబడియున్నది. అది చూచినవారు సంతానము దైవికమని యెంతమాత్రము నమ్మజాలరు. అపుత్రత దంపతులరోగమువలన గలుగుచున్నది. దాని నోషదిసేవచే మాన్పవచ్చును. అట్టి గ్రంథంబు పరిశీలించి, తచ్చికిత్సం జేసినచోఁ దప్పక సంతానము గలుగునని పలికిన నతనిమాటలను లౌకికమున కనుకూలముగా నున్నవని పాటించిరి.

అట్లు వారైదుగురు నుప్పరిగెయందు వెన్నెలలో బల్లచుట్టు పీఠములు వైచుకొని వలయాకారముగాఁ గూర్చుండి సంతానవిషయమైన మాటలాడు కొనుచుండ గోపా! వారి పూర్వపుణ్యమెట్టిదో అంతరిక్షము నుండి యొకమామిడిపం డాబల్లమీదఁ బడినది. విభ్రాంతులై వారట్టె లేచి యాగసంబుదెస జూచిరి. అందు ననతిదూరమున నొకగరుడపక్షి వలయముగా దిరుగుచున్నట్లు కాన్పించినది. అప్పుడు చర్మమునం దప్పక్కి ముక్కుకొనగీటులు నాటియుండుట దిలకించి, వారాపక్షి యాపం డెక్కడనుండియో తీసికొనిపోవుచుండ ముక్కుజారిపడినదని నిశ్చయించిరి.

అప్పుడు బుద్ధిమంతుడగు మంత్రి లేచి పురోహితునితో నీఫలవృత్తాంత మెట్టిదో ప్రశ్నరూపముగా వక్కాణింపు మనుటయు నా సిద్ధాంతి యప్పటిలగ్నమునుబట్టి చూడ నది సంతానజననహేతుభూతమగు ఫలమని తెలియఁబడినది. దానికి వారాశ్చర్యపడి దైవానుకూలమునకు మెచ్చుకొనుచు నప్ఫలం బప్పుడ విడదీసి రాజు టెంకను మంత్రి చర్మమును, బ్రాహ్మణుడు వర్తకుడు రంపాలియు రసఖండమిళితములైన ముక్కలను దీసికొనిపోయి భార్యల కిచ్చి యారాత్రి కళత్రములతో రతిక్రీడావిశేషముల నానందించిరి.

పిమ్మట నుదయమున వారి హృదయములకు గొమరు లుదయించు శుభసూచకములు పెక్కులు దోచిన సంతసించుచుండ వారి భార్యలును గర్భచిహ్నంబులుం దాలిచి పదియవమాసంబున నొకశుభలగ్నంబున నైదుగురు పుత్రులం గాంచిరని వచియించిన మణిసిద్ధునితో గోపాలుం డిట్లనియె. అయ్యా! ఆ మామిడిపండు దినినంతనే వారి భార్యలు గర్భవతులై పుత్రులం గాంచుటచే దానియం దెద్దియో విశేష ముండకపోదు. దానివృత్తాంత మరయ నామన మత్యాతురపడుచున్నయది. వివరింపు డని వేడుకొనుటయు సంతసించుచు వాని కాయతిశ్రేష్టుం డిట్లని చెప్పదొడంగె.