పుట:కాశీఖండము.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

402

శ్రీకాశీఖండము


చంద్రికయు నై త్రైలోక్యకల్యాణమంటపప్రదీపికయు నై యాసర్వమంగళకట్టాయితం బై నిలిచె నప్పుడు.

231


తే.

ధరణిధరరాజకన్యపాదముల కెఱఁగి
కరసరోజద్వయము మోడ్చి కాళరాత్రి
యాదినుండియుఁ దనదువృత్తాంత మెల్లఁ
బూస గ్రుచ్చినచందానఁ బొసఁగఁ జెప్పె.

232


వ.

అనంతరంబ దుర్గాసురుండు వింధ్యాటవీమధ్యంబున వేలంబు విడిసి జంభ మహాజంభ శుంభ వికటానన లంబోష్ఠ పింగాక్ష హయగ్రీవ మహోగ్రాత్యుగ్రవిగ్రహ క్రూరాస్య క్రోధన సంక్రందన మహాలయ జితాంతక దుందుభ వృకానన సింహాస్య క్రూరాస్య ఖర శివారావ మధుపోత్కట శూకతుండ ప్రచండ ముండ మహాభీషణాదు లగుదొరల రావించి యందఱం గలయం గనుకొని యుచ్చైస్స్వనంబున నిట్లనియె.

233


ఉ.

తెంపెసలారఁ గా మనల దీకొనియున్నది యొక్కలేమ దో
స్సంపద వింధ్యభూధరవిశాలశిలాస్థలి నీతలోదరిం
జంపక పట్టి తేవలయుఁ జయ్యన నేగి సరోరుహాక్షులం
జంపకపుష్పకోమలులఁ జంపుట శౌర్యమె! వీరధర్మమే?

234


క.

చలమున నొండెను నొండెను
బలమున బంధించి యొండెఁ బ్రార్థనలీలా
కలనమున వేగ కొని రా
వలయుఁ దరుణిఁ గందకుండ వాడకయుండన్.

235


ఉ.

క్రచ్చఱ నెవ్వఁ డేనిఁ గసుగందక యుండఁ సరోజలోచనం
దెచ్చు నుపాయమార్గమునఁ దెచ్చినయప్పుడ యేను వానికిన్