పుట:కాశీఖండము.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

398

శ్రీకాశీఖండము


వ.

కాళరాత్రియు రుద్రాణియాజ్ఞ శిరంబునఁ దాల్చి యద్దైత్యుసన్నిధి కరిగి యతని కి ట్లనియె.

216


గీ.

రాయబారంబు వచ్చితి రాక్షసేంద్ర!
యచలకన్యక యనుప వింధ్యమున నుండి
బుద్ధిమంతుఁడ వైతేని భువనములకు
బాధ సేయక యుండు నిష్పాపబుద్ధి.

217


వ.

వేదోక్తంబు లైనసర్వక్రియాకలాపంబులుం బ్రతిష్ఠింపం బాలుపడునది యమ్మహాదేవియాజ్ఞం జేసి పెద్దకాలంబు బ్రతుకుము. అట్లు కాదేని బంటవై యకుంఠితోత్సాహంబున నక్కంఠీరవగమన(మధ్య)తోడ యుద్ధము గావింపుము.

218


తే.

హితము చెప్పితి విన నిచ్చయేని లెస్స
జగము బాధింపకుండుట చాలు మాకుఁ
దుహినగిరికన్యయానతిఁ ద్రోచి తేని
యీడ్చికొని పోదు వెండ్రుక లిరియఁబట్టి.

219


వ.

అని గర్వించి పలికినకాళరాత్రిం జూచి కనలి యారాత్రించరేశ్వరుండు.

220


సీ.

అట్టహాసము చేసి యౌరా! ప్రతాపోక్తు
        లాఁటదానికి నింత యదటు వలదు
నే మన్న ననియెఁ గా కేమి మీయేలిక
        సాని వచ్చితి వీవ చాలు మాకు
జగదేకసామ్రాజ్యసంపత్తియును బోని
        యీ వుండవలదె మాయింట నెపుడు?
నేతదర్థమ కదా ఋషి దేవతాకోటి
        దట్టిఁ బెట్టినవాఁడఁ బట్టి తెచ్చి