పుట:కాశీఖండము.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

356

శ్రీకాశీఖండము


జరావ్యాధిదారిద్ర్యంబులు లేవు. ఇప్పు డేమికారణంబుననో యవియును దివ్యాంతరక్షభౌమోత్పాతంబులు పుట్టుచున్నయవి. నాకుం జూడ వేల్పులవేడబంబ కావలయు. మృత్యుంజయుండు త్రిపురవిజయంబును, నారాయణుండు బలిధ్వంసనంబును బురందరుండు వృతాసురవధంబుసు మాయాబలంబున నొనర్చిరి. బలవద్విరోధంబు దుస్తరంబగుట యిప్పు డెఱుంగంబడియె. ఇన్నియు నట్లుండనిము. ఏనును బదివేలేండ్లు రాజ్యంబు సేసితి. జరాభరాక్రాంతుండనై తి. ఇంద్రియంబు లుపరతింబొందుచున్నయవి. ఇంక సకలకర్మనిర్మూలనక్షమం బైనమోక్షం బపేక్షింపవలసియుండు. అమ్మహాపదార్థంబు నా కేయుపాయంబున సిద్ధించు నాయుపాయం బానతి మ్మనిన విని బ్రాహ్మణవేషధారి యగుహృషీకేశుం డమ్మహీవరున కి ట్లనియె.

89


తే.

కాశికాపట్టణమున లింగప్రతిష్ట
యాచరింపుము కల్పింపు హర్మ్యరేఖ
బొందితోడన కైలాసమున కరిగెద
వనఘ! నామాట వేదతుల్యంబు సూవె!

90


తే.

పుత్రుల బట్టంబు గట్టుము బుద్ధి చెప్పు
మాతనికి దేవతాభక్తి యతిశయముగఁ
దనయసంక్రాంతసామ్రాజ్యతంత్రుఁ డగుచు
వనమునకు నేగఁ దగు రాజు వార్ధకమున.

91


వ.

అని బుద్ధి చెప్పి బ్రాహ్మణుం డెక్కడికేనియుం బోయె. దివోదాసుండును నమాత్యుల, మండలేశ్వరుల, నధ్యక్షులం, బురోహితులం, బ్రతిహారుల, ఋత్విజుల, గణకుల, నంతఃపుర