పుట:కాశీఖండము.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

348

శ్రీకాశీఖండము


కాలంబునం దరిష్టంబు ప్రాపింపంగల దనువార్త మ్రోయించి హితుండుసుం బోలె లోలోన బోధించి పౌరజనంబులం గొందఱం గుటుంబసహితంబుగా వెలార్చి, యంతం బోవక యంతఃపురంబులు మాయాబలంబునం బ్రవేశించి, రాజశుద్ధాంతకాంతలకు విస్రంభభాజనంబై జితేంద్రియుం డనుష్ఠానపరుండు శమదమాదిగుణగరిష్ఠుండు సత్యసంధుండు నిస్పృహుండని తన్ను సర్వజనులు సంస్తుతించునట్లుగా డుంఠిభట్టారకుం డను నామంబున మెలంగి, లీలావతి యసు పట్టపుదేవిముఖంబున దివోదాసుం గాంచి యతం డడిగిన ప్రశ్నంబులకు సదుత్త్వంబు లిచ్చి మెచ్చువడసి, యతని పురోహితులలో నొక్కరుండయి వర్తించుచుండె నంత నొక్కనాఁడు.

62


ఉ.

వారక కాశియందు నలువంకలఁ బుట్టెడు దుర్నిమిత్తముల్
పౌరులు విన్నవింప నరపాలుఁడు విస్మయమంది తత్ప్రతీ
కారము నాచరించుటకుఁ గా హితచింతకు నాప్తు డుంఠిభ
ట్టారకుఁ బిల్వఁబంచి నికటంబుననుండి ప్రియం బెలర్పఁగాన్.

63


తే.

చెప్పుమా డుంఠిభట్ట! కాశీపురమునఁ
బుట్టుచున్నవి యుత్పాతములు దఱుచుగఁ
గారణం బెద్ది దీనికిఁ? గలుష మెట్లు
వాటిలెనొ? ధర్మ మేవంకఁ బల్లటిలెనొ?

64


వ.

అని యడిగిన నతం డిట్లనియె.

65


తే.

పార్థివోత్తమ! యిమ్మహోత్పాతములకు
శాంతిఁ గావింతు మంత్రరక్షాబలమున
నాకుఁ జూడంగఁ గాశికానగరి విడిచి
యుండఁ దగుఁ గొన్నినాళ్లు నీ వొక్కవంక.

66