పుట:కాశీఖండము.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకాశీఖండము

234


సీ.

మణికర్ణికావారి మజ్జనం బొనరించి
        యవిముక్తమునయందు శివుని నిల్పి
యాశివలింగంబు ననిశంబు సేవించి
        యందు విశ్వేశ్వరు నావహించి
పంచాక్షరీమంత్రపారాయణంబును
        బ్రణవమంత్రంబును బరిచరించి
విశ్వనాయకుకృపావిభవంబు పెంపునఁ
        బరమోన్నతం బైన పదము గాంచెఁ


తే.

గాశిలోన ధ్రువేశ్వరుఁ గాలగంఠు
భక్తి సేవింప ధ్రువ మైనపదము గలుగుఁ
బంచజనులకు నిది సిద్ధభాషితంబు
సమధికస్మార్తశుభకర్మ! శంబుశర్మ.

288


వ.

అని చెప్పి రంత నివ్విమానంబు ధ్రువలోకంబు గడచి క్రమంబున మహాలోకజనోలోకతపోలోకంబు లతిక్రమించి సత్యలోకంబు గదిసె. అప్పు డవ్విష్ణుకింకరులు శివశర్మ కి ట్లనిరి.

289


శివశర్మ బ్రహ్మవిష్ణుమహేశ్వరలోకంబుల కేగుదెంచుట

క.

ముందఱిది సత్యలోకము
సందర్శింపుము త్రిణేత్రశర్మ! ధరిత్రీ
బృందాలక! యిది పరమా
నందస్థానంబు ద్రుహిణునకు నెల వగుటన్.

290


వ.

అనుచు నతనిం బద్మగర్భుసన్నిధికిం గొనిపోయి రప్పు డవ్విభుండును వారలం బ్రసాదబహుమానంబులం దనిపి ప్రసంగవశంబున నమ్మహాశ్మశానంబున మృతుండు గానివానికి ముక్తి సిద్ధింప దని సముచితప్రకారంబుగా వీడుకొలిపె.