పుట:కాశీఖండము.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

శ్రీకాశీఖండము


లు, నీయూరువులు వైశ్యులు. నీపదంబులు శూద్రులు. నీకేశంబు లంబుధరంబులు. నీవు ప్రకృతిపురుషరూపంబున బ్రహ్మాండంబు సృజియింతు. నీయంద సర్వభూతంబు లుద్భవిల్లు.నీవ సర్వభూతమయుండ వని యనేకప్రకారంబులం బూతాత్ముండు సంస్తుతింపం బ్రసన్నుండై పరమేశ్వరుం డతనికోరినదిక్పాలపదం బిచ్చి తనమూర్తులయందు నంశంబు ప్రసాదించి సర్వగత్వంబును, సర్వావబోధకత్త్వంబుఁ, బ్రాణాపానాదిపంచమూర్తిత్వంబు నొసంగె. అతఁడు కాశీక్షేత్రంబున జ్యేష్ఠేశ్వరుని పశ్చిమభాగంబున వాయుకుండంబు నుత్తరంబునఁ బ్రతిష్ఠించిన యప్పరమేశ్వరునకు నవ్యాక్షిపథంబున భోగమోక్షప్రదత్వంబు సంపాదించి యంతర్హితుం డయ్యె. ఇది గంధవతివృత్తాంతంబు.

75


కుబేరవృత్తాంతము

క.

నిగమజ్ఞ! గంధవాహుని
నగరమునకుఁ దూర్పుదిక్కున గుణోదారం
బగుపట్టణ మదె యలకా
నగరం బది యేలు యక్షనాథుఁడు గరిమన్.

76


వ.

అక్కుబేరునిచరితంబు చెప్పెద మాకర్ణించుము.

77


తే.

భూసురో త్తమ! కాంపిల్యపురమునందు
యజ్ఞదత్తాఖ్యుఁ డొక్కబ్రాహ్మణుఁడు గలఁడు
వేదవేదాంగవేదార్థవిత్తముండు
యజ్ఞవిద్యావిశారదుం డాద్విజుండు.

78


తే.

అతనిపుత్రుండు గుణనిధి యనెడివాఁడు
దర్పకునితోడిజోడు సౌందర్యరేఖ