Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1078

కథాసరిత్సాగరము. లం. 10. త. 4.

'వయస్యా, ఏమి యిట్లు దిగులు పడినట్టులు పలుకుచున్నావు? కారణము చెప్పుము.' అని సంజీవకుఁ డడుగఁగా దమనకుఁడు 'మిత్త్రుఁడా వినుము, నీయందలి ప్రీతిచేత నీకు చెప్పుచున్నాను. మృగరాజు పింగళకుఁడు ఇప్పుడు నీకు విరోధియై యున్నాఁడు. నిరపేక్షుఁడు అస్థిరస్నేహుఁడు నిన్ను వధించి భక్షింపఁ దలఁచి యున్నాఁడు. ఇతని పరివారమువారు ఘాతుకులు సదా ఇతనిని ప్రేరించుచున్నారు.' అనెను. మునుపటి నమ్మికచేత సంజీవకుఁడు దమనకుని యీమాటను విశ్వసించి చింతాకులుఁడై అతనితో నిట్లనియె:- ఇసీ ! ఎంత సేవచేసినను క్షుద్ర రివృతుఁ డైన క్షుద్రప్రభువు వైరమునే పొందును. నిదర్శనము విను.

మదోత్కటము కథ.

ఒకానొక యడవిలో మదోత్కటుఁడని యొక సింహము ఉండెను. దానికి పులి కాకి నక్కయు ముగ్గురు అనుచరులు ఉండిరి. సింహము ఆయడవిలో నొకప్పుడు ఒక లొట్టియ బిడారునుండి చీలి ఏకాకిగా హాస్యకర మైన యాకృతితో తిరుగుచుండఁగా చూచి 'ఇ దేమి జంతువు?' అని ఆశ్చర్యముతో తన యనుచరులను అడిగెను. నానాదేశములు తిరిగిన దైన కాకి 'అది లొట్టియ' అని తెలిపెను. అంతట సింగము కౌతుకముచేత లొట్టియకు అభయ మిచ్చి తన యనుచరులలో చేర్చుకొని తనయొద్ద నుంచుకొనెను. ఒకప్పుడు ఆసింగము గజ యుద్ధములో గొప్ప గాయములు పొంది అస్వస్థ మై అనేకోప