Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1072

కథాసరిత్సాగరము. లం. 10. త. 4.

యున్నాఁడు. మిమ్ము క్షణములో వలలో పట్టి చంప నున్నాఁడు. నాయందు మీకు నమ్మక మున్న యెడల నా మాటప్రకారము రండు. ఒకానొక మాఱుమూల జాలరులు ఎఱుఁగనిది, స్వచ్ఛ జలసమృద్ధము ఒకసరస్సు, కలదు. మిమ్ము ఒక్కొక్కరినిగా కొనిపోయి అందు వేసెదను. అక్కడ నివసింపుదురు గాక.' ఆ మాట విని ఆ పిఱికి జంతువులు జడమతులు మత్స్యములు అయ్యా అయ్యా కొంగయ్యా, అట్లే చేయుము, 'మేము, నిన్ను నమ్ముకొని యున్నాము.' అని మొఱ పెట్టినవి. అంత నా కొంగ ఒకటొకటిగా చేపలను కొనిపోయి ఒకగుంటిమీఁదఁ బెట్టుకొని భక్షించుచుండెను. చేఁపలను అట్లు కొనిపోవుచున్న యాకొంగను ఆసరస్సులో నున్న యొకయెండ్రి కని, 'ఎక్కడికి చేఁపలను కొనిపోయెదవు?' అని యడిగెను. చేఁపలతోఁ జెప్పినట్లే కొంగ యెండ్రితోఁ గూడ చెప్పెను. ఎండ్రి భయపడి తన్నుఁగూడ కొనిపోయి కాపాడు మని కొంగను వేఁడెను. కొంగయు దానిమాంసమునకు నోరూర దానిని కఱచుకొని ఆతిండిగుంటికి కొని పోవుచుండఁగా, ఎండ్రి అచట భక్షితములైన మత్స్యములను అస్థిశేషములను కని 'ఆహా! ఈ కొంగ చేఁపలను నమ్మించి భక్షించుచున్నది గదా?' అని తెలిసికొని, తన్ను అది. రాతిపైఁ బెట్టఁగానే దానిమెడను తెగువతో తన రెండుగోళ్లతోను కత్తిరించి వేసినది. పిమ్మట నాయెండ్రి కడమ