Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1334

కథాసరిత్సాగరము. లం. 12. త. 5

తనశక్తిచే తనతోఁగూడం గొనిపోయి యావిప్రకుమారుని తన యనుచరుంగాఁ జేసికొనెను. అట్లు దేవతలుసయితము ధీరతకు మెత్తురు. ధైర్యపారమితను చెప్పితినిగదా, ధ్యానపారమితను వినుము.

ధ్యానపారమిత.

కర్ణాటదేశములో విజయమాలి యని మహాధనుఁడు వణిజుఁ డుండెను. అతనికి మలయమాలి యని కుమారుఁ డుండెను. ఒకనాఁ డాకుమారుఁడు తండ్రితోఁగూడ రాచనగరికిం బోయి యట నిందుకేసరిభూపాలుని తనయను ఇందుయశ యను దానిం గనియెను. ఆ కన్య అగపడినమాత్రాన మదనుని యీఁటెవోలె నతనియెదం గ్రుచ్చుకొని మోహముం గలిగించెను. అంత నతఁ డింటికి వచ్చి రాత్రులు నిద్ర మాని తెల్లఁబాఱి పగలు ఎటనో సంకుచితుఁడై కలువనోము నోచుఁ చుండెను. ఆమెనే సర్వదా ధ్యానించుచు భోజనాదివ్యాపారములు మానినవాఁడై తనజనులు పల్కరించినప్పుడు మూఁగవలె నేమియు బదులాడ కుండెను. ఇట్లు విరాళిం గుందుచున్న యాతనిని ఏకతంబున నాప్తమిత్త్రుఁడు మంథరకుఁ డనురాజు చిత్రకరుఁడు 'మిత్త్రమా, ఏమి యిది ! నీవు గోడ నంటుకొని రూపైకసారుఁడవై ఆశ్వాసము లేక కనక వినక చిత్తరువువోలె నున్నావు!? అని సనిర్బంధముగా నడిగెను. అంతట వైశ్యకుమారుఁడు మిత్త్రునితో తన వృత్తాంతముం జెప్పెను. అంత