Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1314

కథాసరిత్సాగరము. లం. 12. త. 5

వతియు గుణాకృష్టయై కాముని తీవవిల్లువోలె నరుదెంచెను. గుణవంతములై ఆదిలోనే పూర్వపక్షోపన్యాసము సేయునవి వోలె నింపుగా శబ్దించు చున్న తొడవులచేత నామె వెలుంగు చుండెను. అట్లు వచ్చి మరకతపీఠమునం గూర్చుండిన యామెకు నిర్దోషాంబరంబున నెక్కొన్న నిర్మల చంద్ర రేఖ సాటి వచ్చునేమో? అంత నామె పూర్వపక్షము సేయుచు పలువరుస వెలుఁగు దారముల కడుం బ్రియ మైన నుడువు మానికముల దండను గ్రుచ్చునదివోలె విరాజిల్లెను. వినీతమతి పదపదంబునను ఆమె వాదమున దోషము సూపి క్షణములో నామెను నిరుత్తరం గావించెను. అంతట సభ్యు లెల్ల వినీతమతిం బొగడుచుండ నామె తనకు పరాజయముచే మంచిభర్త లభించినందున దానిని జయముగానే భావించి సంతసిల్లెను. అంత నుదయతుంగుఁడు వినీతమతికి వాదశుల్కార్జితను తనయను ఇచ్చి వివాహము చేసెను. ఆరాజు అరణ మిచ్చిన రత్నములతో నిండి వినీతమతి యా నాగకన్యా రాజకన్యలతో సుఖ ముండెను.

ఒకనాఁడు వినీతమతి జూదమున ఓడిపోవుచున్న సమయమున బ్రాహ్మణుఁ డొకఁడు వచ్చి భోజనమునకు సామగ్రియిప్పింపు మని నిర్బంధించెను. వినీతమతి కోపమున బంటు నొకనిం బిలిచి చెవిలో బోధించి ఇసుక నించినపాత్రమును వస్త్రము కప్పి బ్రాహ్మణుని కిప్పించెను. బ్రాహ్మణుఁడు సరళమతి దానిని గ్రహించి బరువుం గని బంగార మున్న దని యెంచి హర్షంబున