Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిత్త్రద్వయము.

1113

అయుస్సు ధనములును శాశ్వతములు గావు.' అని బోధించిరి. 'మంచిది, నేను చచ్చి పరలోకమందు దుర్గతిని పొందినయెడల అటుతర్వాత దానము చేసెదను.' అని యాతఁడు చెప్పెను. మంత్రులు తమలో తాము నవ్వుకొని ఊర కుండిరి. మూర్ఖుఁడు తన్ను ధనము వదలువఱకు తాను ధనమును వదలఁడు.

మిత్త్ర ద్వయము.

మిత్త్రద్వయమును వినుము. చంద్రాపీడుఁ డని కన్యాకుబ్జమున ప్రభు వుండెను. ఆయనయొద్ద ధవళముఖుఁ డని సేవకుఁడుండెను. వాఁడు నిత్యము బయటనే భుజించి త్రాగి యిల్లు చేరు చుండెను. 'నిత్యము భోజనము చేసి త్రాగి వచ్చెదవు, ఎక్కడనుండి?' అని భార్య యడుఁగగా 'సుందరీ, నేను నిత్యము మిత్త్రులయొద్ద భోజనము చేసి త్రాగి వచ్చుచున్నాను. నాకు ఈలోకములో ఇద్దఱు మిత్త్రు లున్నారు ఒకఁడు కల్యాణవర్మ, నాకు భోజనాదికముచే ఉపకరించువాఁడు, రెండవవాఁడు వీరబాహువు ప్రాణము లయిన నిచ్చి యుపకరించువాఁడు.' అని చెప్పెను. ఆమాట వినిన యంతట భార్య కుతూహలముచే ఆ మిత్త్రుల నిరువురను తనకు చూపు మని వేఁడెను, అంత ధవళముఖుఁడు భార్యతోఁగూడ కల్యాణవర్మ యింటికి పోయెను. అతఁడును వారిని మహార్హోపచారములతోడ సత్కరించెను. మఱునాఁడు వారిరువురును వీరబాహువు నింటికి పోయిరి. అతఁడు జూద మాడుచుండి వారికి స్వాగతము పలికి వదలెను.