Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విలాసినీ సమాగమము.

789

లగుదు రని మిమ్ముఁ గూర్చి సిద్ధులు చెప్పి యుండలేదా? కామచూడామణి, నీవు, సుప్రభయు ఒకగోత్రమువారు. ఈనడుమనే సుప్రభను ఇతఁడు వివాహ మాడియున్నాఁడు. ఇట్లుండఁగా ఇతనికి యుద్ధములో అకల్యాణము ఎక్కడిది! సిద్ధవచనము అబద్ధ మగునా! సుప్రభ ఎవనిచిత్తమును హరించినదో వాని చిత్తమును నీవు హరింపవా? నీవు ఆమెకంటె రూపవతివి. ఆమె బంధు వని నీకేమయిన శంకయేని అది యుక్తము గాదు. సతులకు భర్తకంటె బంధువు లేఁడు.' సఖి యిట్లు చెప్పఁగా విని ఆకన్యారత్నము పలికెను. - 'ఓచెలీ, నీమాట సత్యము. నాకు ఇతరబంధువులతో పని లేదు, ఆర్యపుత్త్రునికి యుద్ధములో జయము కలుగు నని యెఱుఁగుదును. ఇతనికి రత్నములు విద్యలును సిద్ధించినవి. ఓషధులు మాత్రము సిద్ధింపలేదు. అందుచేత నామనస్సు శంకాకుల మై యున్నది. అవి యన్నియు చంద్రపాదపర్వతమందు గుహలో నున్నవి, పుణ్యాత్ముఁ డయిన చక్రవర్తికే అవి సిద్ధించును ఇతఁడు అచటికి పోయి సకలౌషధులను సాధించునెడల ఱేపే యుద్ధము సంభవించినను ఇతఁడు జయించును.' అది యెల్ల విని సూర్యప్రభుఁడు వ్యాజనిద్రను మాని ఆకన్యతో వినయముగా నిట్లనియె. - ఓ మృగాక్షీ, నీవు నాయందు మిక్కిలి పక్షపాతమును చూపితివి. అట్లే నేను అచటికి పోయెదను. నీవు ఎవరవో చెప్పుము.' అంత నామె అతఁడు సర్వము వినె నని లజ్జచే తల వాంచి యుండెను. సఖి