Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సునీథుఁడు బలిని దర్శించుట.

745

సునీథుఁడు బలిని దర్శించుట.

అంతట మయుఁడు సూర్యప్రభాదిసమేతుని సునీథుని బలిచక్రవర్తి దర్శనార్థము మూఁడవ పాతాళమునకుఁ గొనిపోయెను. స్వర్గముకంటె అధిక మయిన యాపాతాళమున వారందఱును హారకిరీటధారి యయి దైత్యదానవ పరివృతుఁ డై యున్న బలిని చూచిరి, సునీథాదులు క్రమముగా అతనిపాదముల వ్రాలిరి. అతఁడును వారిని యథోచిత సత్కారములచే గౌరవించి మయునివలన వృత్తాంతము విని సంతోషించి శీఘ్రముగా ప్రహ్లాదాది దానవులను రావించెను. సునీథాదులు వారి పాదములకును నమస్కరించిరి. వారును ఆనంద నిర్భరులయి ప్రణతులను వీరిని అభినందించిరి. బలి యిట్లనియె :-- 'మన యీసునీథుఁడు భూమిలో చంద్రప్రభుఁడుగా అవతరించి యుండి మరల తనదేహమును పొంది బ్రదికి వచ్చినాఁడు. సుముండీకుని యవతార మైన యీ సూర్యప్రభుఁడును వచ్చి యున్నాడు. ఇతఁడు విద్యాధరచక్రవర్తి యగు నని శంకరుఁడు అనుగ్రహించి యున్నాఁడు. వీరి యజ్ఞ ప్రభావముచేత నా బంధనములు ఊడినవి. కనుక వీరు దొరకుటచే నిశ్చయముగా మనకు అభ్యుదయము కలుగును.' ఇట్లు బలి పలుకఁగా ఆతని గురువు శుక్రాచార్యుఁ డిట్లనియె: - 'ధర్మసత్యపూర్వకముగా వ్యవహరించు వారికి అనభ్యుదయ మెన్నఁడును కలుగదు. కనుక ధర్మ్యముగా నడచుకొనుఁడు. ఇప్పటికిని నామాట జరు