Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1008

కథాసరిత్సాగరము. లం. 9. త. 6

చూర్ణమునకుఁగూడ కందున దైన నీయంగము మధ్యాహ్నార్కాతపమును ఎట్లు సహించును ? నాకు బాలుఁ డైన పుత్త్రుఁ డేల? కొమరిత యేల? నేను పతివ్రతనయేని దేవతలు నీకు మేలు చేయుదురు గాక.' ఇట్లు ఏకాకిని యై ఏడ్చుచు దమయంతి అతఁడు పూర్వము చూపిన మార్గమునఁ బోవుచుండెను. ఎట్ట కేలకు నదులను శైలవనావళులను దాఁటెను గాని నలునిపై భక్తిని మాత్రము వదలలేదు. ఆమె పాతివ్రత్యతేజస్సు ఆమెను మార్గములో రక్షించెను. ఎట్లనిన, లుబ్ధకుఁ డొకఁడు ఆమెను పాపమునుండి రక్షించి కామాతురుఁడై క్షణములో భస్మమై పోయెను. అంతట దైవవశమున వచ్చిన యొక బిడారుతో చేరి ఆమె క్రమముగా సుబాహుమహారాజు నగరము చేరెను. అచట రాజసుత మేడనుండి దూరమునందే ఈమెను చూచి ఆ సౌందర్యమునకు ప్రేమించి రప్పించి తమతల్లికి కానుకగా నొప్పగించెను. మహాదేవి ఆదరించి అడుగఁగా దమయంతి తన్ను భర్త వదలి పోయె నని పలికి, కాలము గడుపుచుండెను.

ఈలోపల ఆమెతండ్రి భీమరాజు నలవృత్తాంతము విని వారి నిరువురను వెదకుటకు ఆప్త జనులను నలు దిక్కులకుఁ బంపెను. వారిలో సుషేణుఁ డను నొకమంత్రి బ్రాహ్మణరూపమున ఆ సుబాహు రాజధానికి వచ్చెను. అచట ఆగంతువులను వెదకుచున్న యా దమయంతిని అతఁడు చూచెను. ఆమెయు తండ్రియొక్క మంత్రిని అతనిం జూచెను. ఇరువురును ఒండొరు