998
కథాసరిత్సాగరము. లం. 9. త. 6
"నేను త్రిభువనపురమున త్రిభువనుఁ డను రాజును. అందు నన్ను ఒక పాశుపతుఁడు చిరకాలము ఆశ్రయించెను. ఏల నన్ను ఆశ్రయించెద వని నే నడుగఁగా తాను బిలఖడ్గము సాధింప నున్నాఁ డనియు నేను తనకు సాయము చేయవలయుననియు వేఁడెను. నేనును అంగీకరించితిని. అంత నతఁడు నన్ను తోడ్కొని యరణ్యమునకుఁ బోయి హోమాదులచే రాత్రి వివరమును కనిపట్టి నన్ను 'ఓయి మహావీరుఁడా, నీవు ముందుగా ఇందు ప్రవేశింపుము. నీకు దివ్యఖడ్గము దొరకఁగానే వెలువడి వచ్చి నన్ను ప్రవేశపెట్టుము. ఇట్లు చేసెద నని నాకు ప్రతిజ్ఞ చేయుము.' అని పలికెను. నేను అతనికి ప్రతిన చేసి వివరములో ప్రవేశించి లోపల నొకరత్నమయగేహమును కంటిని. అందునుండి ప్రధానయైన యసుర కన్యక ఒకతె వెలువడి నన్ను లోనికి తోడుకొని పోయి నాకు ఖడ్గమును ఇచ్చి 'ఈ ఖడ్గము సర్వసిద్ధిప్రదము ఆకాశగతిదాయి, దీనిని పదిలముగా కాపాడుకొనుము.' అని పలికెను. నేను ఆమెతో కొంతకాల ముంటిని. జ్ఞప్తి తెచ్చుకొని వెలువడి పాశుపతుని ఆ యసురమందిరమునకు కొనిపోయితిని. నేను అచట సపరివార యైన మొదటి యసురకన్యతోను అతఁడు మఱియొక యసురకన్యతోను ఉంటిమి. ఒకనాఁడు నేను పానమత్తుఁడ నై యుండఁగా, పాశుపతుఁడు నా ప్రక్క నున్న నాదివ్యఖడ్గమును వంచించి హరించి తన వసము చేసికొని దానివలనఁ గలిగిన మహాసిద్ధియొక్క ప్రభావముచేత