Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కనకవర్షుని కథ.

965

ఆమెవలన సత్కారములు వడసి వెడలితిని. ఆమె పరిజనము ఒండొరులతో పలికికొన్న మాటలవలన నేను ఈపాటి తెలిసికొంటిని: ఆమె నిన్ను గుఱించి విని నీయందు అనురక్త యై యున్నది. అంత నేను ఆమెను గుప్తముగా చిత్రపటములో వ్రాసికొని నీపాదమూలమునకు త్వరితముగా వచ్చితిని. నీ యాకారము చూడఁగా నిన్నే ఆమె నాచేత వ్రాయించిన దని నాకు స్పష్ట మయినది. ఆమెను పలుమాఱు వ్రాయుట శక్యము గాదు కావున నీకు సమానురా లయినను ఆమెను ఇచ్చట ఇప్పుడు నేను వ్రాయను. —

అంత రాజు అతనిని యా చిత్తరువు నయిన చూపు మనెను. చిత్రకారుఁడు గొట్టములోనుండి మదనసుందరియొక్క పటమును తీసి చూపెను. కనకవర్షుఁడు చిత్రగత యైనను విచిత్రరూప యైన యామెను చూచి వెంటనే మదనపరవశుఁ డాయెను. బహుసువర్ణము లిచ్చి రోలదేవుని సత్కరించి ఆమె పటమును చేతఁగొని లోపలి యంతిపురమునకుఁ బోయి, అచట ఆమెయొక్క రూపలావణ్యమును చూచుచు నేత్రములు తనియ తదేకమయమానసుఁ డై సర్వవ్యాపారములు మాని యుండెను. అతనిని రూపమాత్సర్యముచేతనుం బోలే మదనుఁడు తఱి గొని కోలల నేసి ధైర్య మెడలించెను. తన రూపమునకు లో నైన వనితలకు తాను అమితముగా కలిగించిన యార్తి రాజునకు ఇపుడు నూఱింతలుగా ఫలించెను. కొన్నాళ్లకు రాజు విరహ