Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూర్యప్రభుని కథ.

729

లను తండ్రియొద్దకు ప్రహస్తునితో పంపించెను. మఱునాఁడు చంద్రప్రభాదులు అందఱు సూర్యప్రభునితోఁ గూడ పౌరవరాజుతోఁ గూడ చీనదేశమునకు పోయిరి. చీనరాజు వారికి ఎదురు వచ్చి తనకోటకు తోడ్కొని కొమారిత వివాహము జరిపి వధూవరులకు లెక్క లేని సువర్ణగ జాశ్వ రత్న చీనాంబరాదుల నిచ్చెను. అచట చంద్రప్రభాదులు నానాభోగములను అనుభవించుచు కొంతకాలము సుఖముండిరి. సూర్యప్రభుఁడు అచట విలసత్ఘనయౌవనుం డై ప్రావృట్కాలమువోలె విద్యున్మాలచే శోభితుఁ డై యుండెను.

ఇట్లు సూర్యప్రభుఁడు మామగార్ల యిండ్లలో ఆయా కాంతలో సబాంధవుఁ డై భోగములు అనుభవించుచుండెను. పిమ్మట సూర్యప్రభుఁడు సిద్ధార్థాది మంత్రులతో నాలోచించుకొని వీరభటాదిరాజులను వారివారి దండుతో ఇండ్లకు పంపి సురోహమహారాజును వీడ్కొలిపి భూతాసనవిమాన మెక్కి శాకలనగరమునకు పోయెను. నృత్యములు ఒకచోట, సంగీతక రసము ఒకవంక, పానక్రీడలు ఒకయెడ, సుందరీజనుల యలంకారవీధాన మొకతావున, కోరినకోరికలు తీఱిన వైతాళికుల స్తుతి రవములు ఎల్లయెడలనుం గా, పుర మంతయు సూర్యప్రభు రాకచే ప్రమదపూర్ణమై యుండెను. పుట్టినిండ్ల నున్న భార్యల నందఱను రప్పించినవాఁ డై వారితోను వారితండ్రులు వారి కిచ్చిన ధనరాసులతోను, ఆరాసుల బరువుచే వంగిన వీఁపులు