Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూర్యప్రభుని కథ.

725

వాద్యనృత్యమయము గాను సమ్మానిత సర్వరాజకము గాను పూజితబ్రాహ్మణోత్తమముగాను లోకమహోత్సవము చేసెను.

ఆసమయములో ఆకస్మికముగా ఆకాశము ఎఱుపెక్కి సూర్యప్రభునికి కానున్న రక్తారుణత్వమును సూచించునదివోలె నొప్పెను. ఆకాశమార్గమున వచ్చిన పరసైన్యమును చూచి భయపడినవియుంబోలె దిక్కు లెల్ల సంకులశబ్దములు సేయు చుండినవి. ఆక్షణములో ఖేచరులతోడి యుద్ధముకై భూచరులను ఎగురఁజేయునదివోలె మహావాతము వీవ సాగెను. క్షణములో తేజో రాజితదిక్చక్ర మై విద్యాధరసైన్యము దిక్కులు పిక్కటిల్ల సింహధ్వనులు సేయుచు మహావేగముతో వచ్చెను. దానినడుమ మిక్కిలి యందగాని విద్యాధరకుమారుని చూచి సూర్యప్రభాదులు ఆశ్చర్యపడిరి. 'ఆషాఢేశ్వరునికుమారుఁడు దామోదరుఁడు యువరాజు సర్వోత్కృష్టుఁడు. ఓరి మనుష్యుఁడా భూచరా సూర్యప్రభుఁడా, అతనిపాదములలో పడురా. ఓరి జనమేజయుఁడా, మాప్రభువునకు నమస్కరింపుము. నీకొమారితను అనర్హుని కిచ్చితివి. ప్రణిపాతమునఁగాని మాప్రభువు నిన్ను క్షమింపడు.' అని ఆసమయమున విద్యాధరవంది ఆకాశముననుండి దామోదరునియెదుట బిగ్గరగా పలికెను.

సూర్యప్రభుఁడు ఆమాట విని ఆసైన్యమును చూచి, డాలు, కత్తియు, కేలఁ బూని కోపముతో ఆకాశమున కెగసెను. వెంటనే ప్రహస్తుఁడు, భాసుఁడు, సిద్ధార్థుఁడు, ప్రజ్ఞాఢ్యుఁడు,