పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

మూటను గట్టి యింట నున్న వారుసహిత మెఱుగఁకుండ రహస్యముగ బైరాగియొద్దకుఁ దీసికొని వచ్చిరి. అతడు వెంటనే పిడకలదాలిపెట్టించి యామూటను రాశేఖరుఁడుగారి చేతులతోనే దానిలోఁ బెట్టించి పుతము వేసి ఆయనను లోపలికిఁ బోయి విసనగఱ్ఱను చెమ్మని పంపెను. రాజశేఖరుడుగారు విసనకఱ్ఱను బట్టుకొని మరల వఛ్ఛ్హునప్పటికి బైరాగి గొట్టముతో నూదుచుండెను; పిడకలసందున నుండి మూటయు కనఁబడుచుండెను. అప్పుడు బైరాగి మఱికొన్ని పిడకలను పైని బెట్టి మంట చేసి, తానువేమగిరికొడమీఁదఁ నున్న మూలికలను గొనివచ్చుట కయిఁ వెళ్ళె దననియు, తాను బోయి వానిని గొని వచ్చి పసరు పిండిన గాని యంతయు బంగారము కాదనియు, దాను వచ్చులోపల పిడకలను వేసి మంటచేయుచు జాగ్రతతోఁ గనిపెట్టుకొని యుండవలయుననియుఁ జెప్పి. మూలికలనిమిత్తమయి వెళ్ళెను. అతఁడు వనమూలికల కయివెళ్ళి యేవేళకును రానందున, రాజశేఖరుఁడుగారు తామక్క డనేయుండి, బైరాగిని పిలుచుకొని వచ్చుటకయి మనుష్యులనుబంపిరి. వారును గొడయంతయు వెదకి యొక్కడను అతని జూడను గానక మందుచెట్టు దొరకకపోవుటచేత దూరపుకొండలకు బోయినాఁ డేమో యనుకొని మరలవచ్చి యావార్తను జెప్పిరి. ఆబైరాగి బంగారముచేయు మూలికలు దొరకనందున గాబోలుమరలరానేలేదు. అతని నిమిత్తమయి యొక దినమువఱకు వేచియుండి రాజశేఖరుఁడుగారు పుటము దీసిచూచునప్పటికి దానియందు బంగారమును వెండియు లేదుగాని తెల్లని భస్మముమాత్ర ముండెను. సులభముగా రజితభస్మమును సువర్ణభస్మమును నయినందున రాజశేఖఁడుగారు సంతొషించి పదిలముగా దానిని దాచిరికాని, యేమికారణముచేతనొ యాభస్మమునందు బరువుగాని సువర్ణాదిభస్మములయందుండు గుణముకాని కనఁబడలేదు.