పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తా నావఱకు పోయినవస్తువులు తెప్పించినానన్న స్థలములపట్టిక నొక దానిని బహుదినములు ప్రయాసపడి వల్లించినవానివలె తడవుకో కుండ జదివెను. అప్పుడు సిద్ధాంతి రుక్మిణివస్తువు పోయినసంగతి జెప్పి దానిజాడ చెప్పవలయునని ప్రార్థించెను. తోడనే హరిశాస్త్రులు తన ముక్కుపుటములయొద్ద వ్రేలుపెట్టుకొనిచూచి, ఆకాశము వంక జూడ్కినిగడించి వ్రేళ్లుమణచి యేమో లెక్కించి నిమిష మాలోచించి 'పోయినవస్తువు ఇక్కడకువచ్చుచు బోవుచు నుండు వారిచేతనే చిక్కినదికాని యిల్లు దాటిపోలే' దని చెప్పెను. ఇంతలో రాజశేఖరుడుగారి ముఖప్రక్షాళన మయినందున నందఱు గలిసి లోపలికి బోయిరి. నడవలో నిలుచుండి హరిశాస్త్రులు వస్తువును దెప్పించి యిచ్చుటకు తనదే భార మనియు, మధ్యాహ్నము వచ్చి యంత్రము వేసెదనుకాబట్టి యాసమయమున కింట నున్న సేవకు లందఱును సిద్ధముగా నుంచవలయు ననియు జెప్పి, 'లోపలి నుండి కొంచెముబియ్య మిప్పుడు తెప్పింపుడు' అని కోరెను. సిద్ధాంతియే లోపలికి బోయి యొక పళ్ళెముతో బియ్యమును దీసికొనివచ్చి శాస్త్రుల కోరికప్రకారము గృహమున గనబడ్డ భృత్యవర్గమును బిలుచుకొనివచ్చెను. ఆమీదట శాస్త్రులు తన మంత్రప్రభావమును గొంచెము చిత్తగింపవలయు నని మనవిచేసి, అక్కడ నున్నవారిలో నెవ్వరైన నొనవస్తువును దీసి రహస్యముగా దాచినయెడల వారి పేరును జెప్పెద నని చెప్పి, తాను వీధిలోనికి బోయెను. అప్పుడు రాజశేఖరుడుగారు తన యుంగరము లొకనిచేతి కిచ్చి పదిలముగా దాపించి, యాతడు వచ్చి కూరుచున్నతరువాత శాస్త్రులనులోపలికి బిలిచి యుంగరమును దాచినవానిని జూపు మని యడిగిరి. శాస్త్రులు తోడనేయక్కడ నున్న పదిమంది చేతులలో బియ్యమును బెట్టి యొక రొకరే వచ్చి బియ్యమును పళ్ళెములో బోయవలె నని చెప్పి