Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

రాజశేఖర చరిత్రము

సంచులు కొట్టిన మేకులకు దశావతారములు మొదలయినపటములు చిన్నవి వేయఁబడియున్నవి. దక్షిణపుగోడకు శ్రీరాములవారి పట్టాభిషేకము తగిలింపఁబడి యున్నది. దానినే రాజశేఖరుఁడుగారు నిద్రలేచినతోడనే చూచి, ఆవల మఱియొకవస్తువునుజూతురు. గదికిఁబయిని ఆందమయిన బల్లకూర్పుకూర్చఁబడియుండెను. మంచమున కెదురుగా దక్షిణపుగోడపోడుగునను గడమంచెమీఁగా వరుసగా కావడిపెట్టెలు పెట్టఁబడి యున్నవి. ఆ పెట్టెలలో సాధారణముగా ధరించుకొను వస్త్రములును నాగరలిపితో బంగాళాకాకితములమీఁద వ్రాయఁబడిన రాజశేఖరుఁడుగారి సంస్కృతపుస్తకములును వేయఁబడియుండెను. గదిలో పడమటిగోడతట్టున పెద్దమందస మొకటి గట్టితాళము వేయబఁడి యుండెను. ఆమందసములోపలనున్న చిన్న తాళపుపెట్టెలలో నగలును పండుగదినములలో ధరించుకొను విలువబట్టలును రొక్కమును ఉండును. చీఁకటిరాత్రులలో దొంగల భయము విశేషముగా నుండునప్పుడు రాజశేఖరుఁడుగారు ఆమందసముమీఁదనే పఱపు వేయించుకొని పరుందురు. మందసమునకును కావడిపెట్టెలున్న గడమంచెకును మధ్యను దక్షిణవైపున గదినుండి దొడ్డిలోనికిఁ బోవుమార్గ మొకటి కలదు. ఆ మార్గమున దొడ్డిలో ప్రవేశించినతోడనే విశాలమయిన చేమంతిమడి యొకటి పచ్చని పూవులతోను మొగ్గలతోను నేత్రోత్సవము జేయుచుండెను. దాని కెడమ ప్రక్కను గొంచెముదూరమున మల్లెతీఁగెలు పందిరిమీఁద నల్లుకొని యకాలమగుటచే నప్పుడు పుష్పింపకపోయినను పచ్చనికాంతుల నీనుచు మనోహరముగా నుండెను.

రాజశేఖరుఁడుగారి పడకగది ముందఱిచావడిలో దూలమునకుఁ జిలుకపంజర మొకటి వ్రేలాడఁగట్టఁబడియుండెను. అందులో నున్న చిలుక సదా "ఎవరువారు" "ఎవరువారు" "పిల్లివచ్చె కొట్టు