పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేకపోయెను. నేనొక్క పరీక్షయందుఁజేఱి పాఠశాలను విడుచునప్పటికి నా భార్యయెడిగి కాపురమునకువచ్చెను. మా మాన్యముల మీద వచ్చెడి యాదాయము మేము చేసిన ఋణముల వడ్డికే చాలనందున నా కుటుంబభారము కూడ మా మేనమామగారి మీదనే పడెను. అందుచేత రెండు కుటుంబములను పోషించుట దుర్భరమయినందున మా మేనమామగారు నన్ను చదువు మానిపించి, విశాఖపట్టణము పోయి యెవ్వరెవ్వరినో యాశ్రయించి విశేష కృషిచేసి దొరతనమువారి కార్యస్ధానములో నొకచోట నాకు నెలకు పదునేను రూపాయల జీతము గల యద్యోగమును చెప్పించిరి. ఆ పనిలో నుండఁగానే యప్పులవారు నా మీద వ్యాజ్యములు వేసి ధనద్విగుణమునకు తీర్పులను పొంది నా మాన్యముల నమ్మించిరి. నా మాన్యముల విక్రయము వలన వచ్చిన సొమ్ముతో నా ఋణము సగము తీరినది. మిగిలినది తీఱుటకు సాధనముకనఁబడలేదు. అప్పులవారు ప్రతి దినమును వచ్చి నాయిల్లు చుట్టుకొని ఋణము తీర్పుమని నను నానావిధముల చిక్కులు పెట్ట మొదలుపెట్టిరి. ఈ చిక్కులలో నుండగా నాకుగ్రామముల వెంట తిరిగెడి మఱియొకపనియైనది. ఈ క్రొత్త పనిలో జీతమిరువది రూపాయలయినను, ఆయెక్కువ జీతము ప్రయాణవ్యయములకే చాలకుండెను. ఇప్పుడింకొక విధమయిన క్రొత్త వ్యయము కూడ నామీఁదపడెను. నాకెప్పుడును గుప్తదానము చేయుటయందేయిష్టము. ఇప్పుడట్టి దానములు చేయవలసిన నిర్భంధము కూడ నాకు తటస్థమయ్యెను. అట్టిదానములు చేయకపోయినయెడల నా పనికి కూడ భంగమువచ్చునట్లు కానఁబడెను. మా మండలము నందప్పు డుద్యోగస్ధులలో లంచగొండులధికముగా నుండురి. అప్పుడు మాపై అధికారులు పూర్వపువారు మాఱి క్రొత్తవారు వచ్చుట తటస్ధించెను. అందరికంటెను కష్టపడి యెక్కువ పని చేయుచున్నను నేను పనితిన్నగా చేయుచుండలేదని కోపపడుచు వచ్చినందున నాహితుల యుపదేశము చేత శిరష్తాదారుగారికి మూఁడు