పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

206

రాజశేఖర చరిత్రము
కను స్వస్తివాచకబృందములును దృగ్గోచరమయ్యెను. ఆ యాడంబరము చూచి రాజశేఖరుఁడుగా రాదిన మేదో దేవతోత్సవము కాఁబోలుననుకొని, కుమారునివంకఁ జూచి యాయుత్సవము శివుని దయియుండునా విష్ణుని దయి యుండునాయని యడిగిరి.
సుబ్ర---- అది దేవుని యుత్సవము కాదు. శ్రీశంగరభగవత్పాదులవా రీపట్టణమునకు వేంచేసి యుందురు. వారు నెల దినములనుండి పిఠాపురములో నివాసము చేసియున్నారు. నేను బయలు దేరినప్పుడే వారును ప్రయాణ మయి యీపట్టణమునకు రావలెనని బండ్లు మొదలగు వానిని వాకిట నిలువఁబెట్టియుండఁగాఁ జూచితిని.
రాజ---- అక్కడ భిక్షలు విశేషముగా జరిగివా?
సుబ్ర---- మిక్కిలి చక్కగా జరిగినవి. వారింటింటికిని శ్రీముఖములను వ్రాసి తలకొక రూపాయవంతున పోగుచేసినారు. అదిగాక యనేక వితంతువులను ధనవంతువులను పళ్ళెరములలో పండ్లును రూపాయలను వేసుకొని వెళ్ళి పాదపూజ కని సమర్పించుకొనుచు వచ్చిరి. వారు సాష్టాంగనమస్కారము చేసినప్పుడెల్లను స్వాములవారు ' నారాయణ ' యనుచు రాఁగా, చేరువనుండు శిష్యులు పళ్ళెములోనివానిని జాగ్రత్త చేసి వట్టిపళ్ళెములను వారివి వారికి మరల నిచ్చుచుండిరి. గ్రామమునందలి వైదికులందరును జేరి రెండు భిక్షలు చేసినారు; లౌక్యుల యిండ్లలో నాలుగు భిక్షలు జరిగినవి; తక్కిన దినములలో కోమట్లు బ్రాహ్మణ గృహమున భిక్షలు చేయించుచు వచ్చిరి.
రాజ---- నీ వెప్పుడయిన వెళ్ళి పీఠదర్షనము చేసినావా?
సుబ్ర---- రెండుమూడు పర్యాయములు చేసినాను. పీఠము నిలువెడెత్తున నున్నది; దానినిండను బహువిధములైన విగ్రహములను పాలగ్రామములును నున్నవి. వెండిపువ్వుల పీట మీఁదఁ గూరుచుండి