పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నప్పుడు మైల యెంతకాలము పట్టవలెనో తెలిసికోవలెనన్నను, జబ్బు నక్షత్రమున నెవ్వరైన మృతినొందినప్పుడు ఇల్లు వదలి యెంతకాలము లేచిపోవలెనో కనుగొనవలెనన్నను, రోహిణ్యాది నక్షత్రములయందు బిడ్డను గన్నప్పుడేమి శాంతి తగులునో యెఱుగవలెనన్నను, సిద్ధాంతి యొద్దకు రాక సరిపడదు. ఏ కాపువాని పశువు తప్పిపోయినను, ఎవనింట నేవస్తువు పోయినను వచ్చి సిద్ధాంతిగారి నడుగకపోరు. ఇటువంటి సమయములందెల్లను, అతడు వీధినడవలో నేల మీద ఇసుక పోసి దానిలో పూచికపుడకతో ఏమేమో బీజాక్షరములును అంకెలును వ్రాసి మీది వంక చూచి యాలోచించి వచ్చిన కార్యమిదియనియు కార్యమీ ప్రకారముగా నగుననియు చెప్పి పంపుచుండును. అతడు బల్లిపాటు మొదలైనవాని ఫలములును, శకునములు చూచి సంతానము కలుగు కాలమును కూడా చెప్పుచుండును. వేయేల? సిద్ధాంతి యాలోచన లేక యా చేరువ గ్రామములో ఏ శుభకార్యము కానీ, యశుభకార్యము కానీ జరుగదు. ఆతడు చెప్పెడి జ్యౌతిషము తఱుచుగా అబద్ధమే యగుచు వచ్చినను, అప్పుడప్పుడు కాకతాళీయముగా కొన్ని సంగతులు నిజమగుటయు గలదు గనుక జనులాతని మాట యమోఘమని నమ్ముచునే యుండిరి.

అప్పుడా చావడిలో నున్నవారిలో నెవరో "బైరాగులు భూతవైద్యమునకు గట్టివా"రని మెల్లగాననిరి. అంతలో రాజశేఖరుడు గారు సిద్ధాంతిగారి వంక జూపు త్రిప్పి "ఔను. బైరాగులన్న తోడనే జ్ఞప్తికి వచ్చినది. పది దినముల క్రిందట ఈ గ్రామమున కెవ్వడో యొక బైరాగి వచ్చినాడట! అతనికి జూపింపరాదా? గోసాయీలకు బరమహంస క్రియలును వనమూలికలును విశేషముగా దెలసియుండును. వాండ్రెట్టి యసాధ్యమైన పీడలనైనను జిటికెలో బోగొట్టుదురు" అనిన తోడనే చావడి యంతయు 'చిత్తము' 'వాస్తవము'