పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదమూడవ ప్రకరణము

శంకరయ్య కాసులపేరుతో వచ్చుట - అతఁడు తన తండ్రివృత్తాంతమును వినిపించుట - వైష్ణవగురువుల యూరేగింపు - నృశింహస్వామియొక్క రాక - అతఁడు తన కథను జెప్పుట.

పైని చెప్పినరీతిగా రుక్మిణియు తల్లిదండ్రులును మాటాడుకొనుచుండఁగానే, పదునాఱుసంవత్సరముల యీడుగల యొక చిన్నవాఁడు వచ్చి బుజముమీఁది మూటను క్రిందఁ బడవైచి రాజశేఖరుఁడుగారి కాళ్ళమీఁద బడి "అయ్యో మామయ్యా" యని యేడువనారంభించెను.

రాజ - ఏమి శంకరయ్యా! ఆఁడుదానివలె నాలాగున నేడ్చుచున్నావు? ఊరుకో.

శంక - మానాయన పదియేను దినములక్రిందట కాలము చేసినాఁడు. నేనప్పుడు గ్రామములోకూడ లేకపోయినాను.

రాజ - ఏమిరోగముచేతపోయినాఁడు? నీవప్పుడు గ్రామములోలేక యెక్కడకు వెళ్ళినావు?

శంక - ఆతఁ డాత్మరోగముచేత పోలేదు; ఇల్లుకాలి పోయినాఁడు. నేనావఱకుపదిదినములక్రిందటనే నాసవతితల్లిని తీసికొని యేలూరు వెళ్ళియుంటిని. నే నక్కడనుండగా నాకీ వర్తమానము తెలిసినది.

రాజ - ఇ ల్లెందుచేత కాలిపోయెనో యాతఁడేల బయటకు రాకుండెనో నా కాసంగతి వివరముగాఁ జెప్పు.

శంక - మీరు గ్రామములో నుండఁగానే మానాయన భూతవైద్యమునందు ప్రబలుఁడుగా నున్నాఁడుగదా? అటుతరువాత చుట్టు